న్యూఢిల్లీ: ప్రస్తుతం రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. పార్టీ ప్రతినిధులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. సీడబ్ల్యూసీ నిర్ణయం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తిందని విజయమ్మ ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్ పార్టీ సమన్యాయం పాటించలేదన్నారు. ఇలా సమన్యాయం చేయనప్పుడు రాష్ట్రాన్ని ముక్కలు చేసే అధికారం ఆ పార్టీకి ఎవరు ఇచ్చారని విజయమ్మ ప్రశ్నించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజయమ్మ రాష్ట్రపతిని కోరారు.
అంతకు ముందు ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న విభజన నిర్ణయం తర్వాత రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులపై ప్రధానికి ఒక మెమొరాండం సమర్పించారు.