రాష్ర్టస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

1 Feb, 2016 04:48 IST|Sakshi
రాష్ర్టస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం


 రెంటచింతల : కనుమరుగవుతున్న సంప్రదాయ క్రీడలను కాపాడుకుందామని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక వైఆర్‌ఎస్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఆదివారం కానుకమాత తిరునాళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఆయన గురజాల డీఎస్పీ నాగేశ్వరావుతో కలసి ప్రారంభించి మాట్లాడారు. డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు.

అనంతరం ఎమ్మెల్యే, డీఎస్పీలు కబడ్డీ ఆడి ప్రేక్షకులను రంజింపచేశారు. మొత్తం 32 టీమ్‌లు పాల్గొన్నాయి. పోటీల్లో సాగర్‌మాత జూనియర్ కళాశాల జట్టు ఆనంద్ సీసీపై.. రెంటాల భాస్కర్‌రెడ్డి జట్టు.. రామచంద్రాపురం జట్టుపై, వైఆర్‌ఎస్ జూనియర్స్ టీం.. రాయవరం జట్టుపై, డేగల విజయ్ టీం.. గురజాల రెబల్  సీసీపై విజయం సాధించినట్లు నిర్వాహకులు, వ్యాయామ ఉపాధ్యాయుడు పల్లెర్ల లక్ష్మారెడ్డి తెలిపారు.

కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి అల్లం ప్రతాప్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పూజల రామయ్య, ఉప సర్పంచ్ ఏలూరిసత్యం, వైఎస్సార్ సీపీ రాష్ర్ట యువజన కార్యవర్గసభ్యుడు ఉమామహేశ్వరెడ్డి, పమ్మి సీతారామిరెడ్డి, రిటైర్డు ఎంఈవో గోగిరెడ్డి సీతారెడ్డి, యేచూరి వెంకటసైదయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు