సిగ్గేస్తోంది

14 Nov, 2014 02:16 IST|Sakshi
సిగ్గేస్తోంది

నేటికీ 2199 స్కూళ్లలో అందుబాటులో రాని మరుగుదొడ్లు
1264 స్కూళ్లలో అందని చుక్కనీరు
సుప్రీం ఆదేశించినా ఫలితం శూన్యం
నేడు పాఠశాలలను పరిశీలించనున్న సుప్రీం కోర్టు కమిషన్ సభ్యులు    
 

 అనంతపురం ఎడ్యుకేషన్ : విద్య రంగం అభివృద్ధికి ప్రభుత్వాలు తిలోదకాలిచ్చాయి. పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతుండడం ఇందుకు అద్దం పడుతోంది. కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చెప్పనలవిగా ఉన్నాయి. విద్యాభిృద్ధికి రూ. కోట్లు వెచ్చిస్తున్నట్లు గొప్పలు పోతున్న ప్రభుత్వం...  క్షేత్ర స్థాయిలో ఆ నిధులను సక్రమంగా వెచ్చించలేకపోతోంది. ఫలితంగా పలు సమస్యలతో పాఠశాలలు సతమతమవుతున్నాయి. ఈ క్రమంలోనే చివరకు దేశ సర్వోన్నత న్యాయస్థానం కల్పించుకోవాల్సి వచ్చింది. 2012 మార్చి 31 నాటికి ప్రతి ప్రభత్వు పాఠశాలలోనూ తాగునీరు, మరుగుదొడ్లు నిర్మించాల్సిందేనని ఆదేశించింది. తర్వాత అదే ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు పొడగించింది. ప్రస్తుతం గడువు ముగిసి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇప్పటికీ అత్యధిక స్కూళ్లను మౌలిక వసతుల సమస్య వెంటాడుతోంది.

జిల్లా కేంద్రంలోనే..

అనంతపురంలోని కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాలలో 6-10 తరగతుల విద్యార్థినులు సుమారు 825 మంది చదువుతున్నారు. ఇంతమందికి ఉన్నది కేవలం ఏడు మరుగుదొడ్లు. నీటి వసతి అంతంత మాత్రమే. ఇంటర్వెల్ సమయంలో అంతమంది యూరినల్స్‌కు వెళ్లాలంటే  సమయం ఉండదు. ఓ వైపు కంపు కొడుతుండడం, మరోవైపు అమ్మాయిలు క్యూలో నిల్చోని ఉండడం ఇంతలోనే బెల్ మోగడంతో చాలా మంది కనీస అవసరాలను సైతం తీర్చుకోలేక వెనుదిరగాల్సి వస్తోంది. మరికొందరు కంపు వాసన భరించలేక ఆవైపు కూడా వెళ్లరు.  అలాగే శ్రీ పొట్టిశ్రీరాములు నగరపాలక ఉన్నత పాఠశాలలో సుమారు 800 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. నీరు పుష్కల ంగా అందుబాటులో ఉన్నాయి. మరుగుదొడ్లు కూడా ఆశించిన స్థాయిలో  ఉన్నాయి. అయినా వాటిల్లోకి విద్యార్థులు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇందుకు కారణం వాటిని శుభ్రం  చేయకపోవడమే. ఆ దరిదాపుల్లోకి వెళ్లాలంటేనే విద్యార్థులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ మరుగుదొడ్లకు దగ్గర్లో ఉన్న తరగతుల విద్యార్థులు కూడా దుర్వాసన భరించలేక పోతున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఇదే సమస్యే...

జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు మొత్తం 3896 ఉన్నాయి. వీటిలో 3559 స్కూళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయి. 337 స్కూళ్లలో మొన్నటిదాకా లేవు. కలెక్టర్ హడావుడి చేయడంతో ఇవి ప్రస్తుతం నిర్మాణ దశల్లో ఉన్నాయి. మరుగుదొడ్లు ఉన్న 3559 పాఠశాలల్లో కేవలం 1360 స్కూళ్లలో మాత్రమే వినియోగించుకోగలుగుతున్నారు. నీటి వసతి, తదితర సమస్యలతో మిగిలిన 2199 స్కూళ్లలోని మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. ఫలితంగా విద్యార్థినుల వెతలు వర్ణణాతీతం. చాలా స్కూళ్లలో మహిళా ఉపాధ్యాయునులదే ఇదే సమస్య. ఉదయం స్కూల్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి సాయంత్రం ఇంటికెళ్లే వరకు వ్యక్తిగత అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను బయటకు చెప్పుకోలేక లోలోపు మదననపడుతున్నారు.
 
1264 స్కూళ్లలో తాగునీరు కరువు


జిల్లాలోని 1264 పాఠశాలల విద్యార్థులు తాగునీరు దొరక్క విలవిల్లాడుతున్నారు.  మొత్తం 2632 స్కూళ్లలో తాగునీటి సదుపాయం ఉంటే వాటిలో 1788 స్కూళ్లలో మాత్రమే ప్రస్తుతం అమలులో ఉంది. వివిధ కార ణాల వల్ల తక్కిన 844 స్కూళ్లలో విద్యార్థులు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇక వంటగది  సంగతి దేవుడెరుగు. 2011-13 విద్యా సంవత్సరంలో కిచెన్‌షెడ్లు మంజూరైనా నేటికీ నిర్మాణాలు ప్రారంభం కాని  స్కూళ్లు కొకొల్లలుగా ఉన్నాయి. 2216 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కిచెన్‌షెడ్లు నిర్మించేందుకు ఒక్కొ యూనిట్ రూ. 75 వేలు ప్రకారం మొత్తం రూ. 13 కోట్ల 10 లక్షల 97 వేలు మంజూరైంది. ఈ మొత్తం ఆయా స్కూళ్ల ఎస్‌ఎంసీ ఖాతాల్లో ఉంది. అయినా నిర్మాణాలకు ముందుకు రావడం లేదు.

నేడు సుప్రీం కోర్టు కమిషన్ సభ్యుల బృందాలు పరిశీలన

 సుప్రీం కోర్టు కమిషన్ సభుృల బందం జిల్లాలో శుక్రవారం వివిధ పాఠశాలలను పరిశీలించనుంది. ముగ్గురు సభ్యులు మూడృు బందాలుగా విడిపోయి వివిధ మార్గాల ద్వారా వెళ్లి పాఠశాలలను పరిశీంచనున్నారు. వీరు ముఖ్యంగా సుప్రీంకోర్టు సూచనలు అమలు చేస్తున్నారా...లేదా? అనే అంశాలను పరిశీలిస్తారు. తాగునీరు, మరుగుదొడ్లు, కిచెన్‌షెడ్ల పరిశీలన ప్రధానంగా ఉంటుంది. కాగాృఈ బందం పర్యటన జిల్లా  అధికారుల్లో ఒత్తిడి చోటు చేసుకుంది.     
 
 
 

మరిన్ని వార్తలు