అధికారులు, సిబ్బంది అనుమతి లేకుండా
హెడ్క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదు
కరోనా లక్షణాలను దాచిపెడితే క్రమశిక్షణ చర్యలు
సాక్షి, అమరావతి: హైకోర్టు కరోనా కట్టడికి తమ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, సందర్శకుల విషయంలో కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ ఈ మార్గదర్శకాలు జారీ చేశారు.
►హైకోర్టు అధికారులు, సిబ్బంది ముందస్తు అనుమతి లేకుండా హెడ్క్వార్టర్స్ను విడిచి వెళ్లకూడదు. ఒకవేళ అనుమతి లేకుండా వెళితే దాన్ని తీవ్రంగా పరిగణిస్తాం.
►ఎవరైనా అనుమతి తీసుకుని రాష్ట్రం దాటితే, తిరిగి విధుల్లోకి వచ్చే ముందు విధిగా క్వారంటైన్లోకి వెళ్లితీరాలి.
►హైకోర్టు ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి. అనంతరం మాస్కులు ధరించినవారినే లోపలికి అనుమతిస్తారు.
►జ్వరం, కోవిడ్ లక్షణాలున్న వారిని కోర్టు ప్రాంగణంలోకి అనుమతించరు.
►అధికారులు, సిబ్బంది, డ్రైవర్లు భౌతిక దూరాన్ని పాటించాలి. కోవిడ్ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉంటే, వెంటనే వివరాలను సంబంధిత కంట్రోలింగ్ అధికారికి తెలియచేయాలి.
►అన్ని వేళల్లో కారిడార్లలో, కార్యాలయాల్లో సమూహాలుగా ఉండటం నిషిద్ధం. అధికారిక పని ఉంటే మినహాయింపు.
►ప్రతి కంట్రోలింగ్ అధికారి తమ సెక్షన్ల వద్ద శానిటైజర్లు, హ్యాండ్ వాష్లు అందుబాటులో ఉంచాలి.
►కంటైన్మెంట్ జోన్ల్లో నివాసం ఉంటున్న అధికారులు, సిబ్బంది తమ వివరాలను కంట్రోలింగ్ అధికారులకు తెలియచేయాలి.
►మొత్తం హైకోర్టు ప్రాంగణాన్ని తరచూ శానిటైజ్ చేస్తూ ఉండాలి.