రామన్న బలిదానం

5 Dec, 2013 05:41 IST|Sakshi

 నిజాంసాగర్, న్యూస్‌లైన్: ‘‘ఎలాంటి ఆంక్షలు లేకుండా హైదరాబాద్ రాజధానిగా పదిజిల్లాలతో కూడిన తెలంగాణను ఇవ్వాలని, భద్రాచలాన్ని మా నుంచి విడదీయొద్దని సోనియాగాంధీ అమ్మను కోరుతున్నా..’’ అంటూ లేఖ రాసి ప్రాణం విడిచాడు రాములు. ఈప్రాంత ప్రజల దశాబ్దాల ఆకాం క్షను పక్కనపెట్టి ఎవరూ కోరుకోని రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడాన్ని జీర్ణించుకోలేని నిజాంసాగర్ మండలం హసన్‌పల్లికి చెందిన మొకిరె రాములు(23) బుధవారం వేకువజామున ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ ఏర్పాటుపై తర్జనభర్జనలతో కలత చెంది క్రిమిసంహారక మందు సేవించి ప్రాణం తీసుకున్నాడు. . మొకిరె దుర్గయ్య, దేవవ్వ దంపతుల కుమారుడైన రాములు ఎంఎస్సీ బీఎడ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం బాన్సువాడలో పీజీడీసీఏ చేస్తున్నాడు.
 
 హోరెత్తిన నిరసనలు
 విద్యార్థి రాములు ఆత్మహత్యతో జిల్లావ్యాప్తంగా తెలంగాణ వాదులు, ఉద్యోగులు, రాజకీ య ఐకాస నాయకులు ఆందోళనకు దిగారు. రాములు ఆత్మకు శాంతి చేకూరాలంటే పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వారంతా హసన్‌పల్లి గ్రామానికి చేరుకొని తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతత్వంలో నిర్వహించిన ధర్నా, రాస్తారోకోలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే పాల్గొన్నారు. రెండు గంటల పాటు బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద హైదరాబాద్-బోధన్-నిజాంసాగర్-ఎల్లారెడ్డి ప్ర ధాన రహదారులపై ఆందోళనలు నిర్వహించా రు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థి మృతితో తెలంగాణవాదులు, నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాస్తారోకో, ధర్నాలు చేపట్టడంతో పోలీసులు చాకచక్యంగా మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వా స్పత్రికి తరలించారు. టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లె రవీందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బాణాల లక్ష్మారెడ్డి తదితరులు రాములు తల్లిదండ్రులను పరామర్శించారు.  
 ఆందోళనలో స్థానిక నాయకులతో పాటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
 
 హసన్‌పల్లిలో అంత్యక్రియలు..
 రాములు మృతదేహాన్ని పోలీసులు ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిం చారు. అనంతరం కుటుంబసభ్యులకు అందించారు. హసన్‌పల్లిలో నిర్వహించిన అంత్యక్రియల్లో గ్రామస్తులు, అధికసంఖ్యలో తెలంగాణవాదులు పాల్గొన్నారు. జెతైలంగాణ, రాములు అమర్ రహే అంటూ నినదించారు.
 

మరిన్ని వార్తలు