విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం

9 Nov, 2013 02:39 IST|Sakshi

 

=గిరిజన హాస్టళ్లపై పీవో దృష్టి
 =విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం
 =విస్తృత తనిఖీలకు రంగం సిద్ధం

 
పాడేరు, న్యూస్‌లైన్: ఐటీడీఏ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న గిరిజన విద్యాలయాల పై ప్రాజెక్టు అధికారి దృష్టి సారించారు. చాలా కాలంగా ఐటీడీఏకు రెగ్యులర్ పీవో లేకపోవడంతో మన్యంలోని వివిధ శాఖల పనితీరులో తీవ్ర నిర్లక్ష్యం నెల కొందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా రెగ్యులర్ పీవోగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి వి.వినయ్‌చంద్ అన్ని శాఖల పనితీరుపై దృష్టి సారిస్తున్నారు. ఏజెన్సీలో విద్యా వ్యవస్థను చ క్కదిద్దడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించేందుకు ఆయన కార్యాచరణ సిద్ధం చేసినట్టు సమాచారం.

ఏజెన్సీలో 103 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, 11 కస్తూర్భాగాంధీ విద్యాలయాలు, 10 గిరిజన గురుకుల విద్యాలయాల్లో సుమారు 30 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి విద్యతోపాటు నాణ్యమైన ఆహారం, ఇతర వసతి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చుపెడుతోంది. వసతి సౌకర్యాల మాట ఎలావున్న విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆహారం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొందనే భావన పీవోలో వ్యక్తమవుతోంది. కొన్ని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదనే ఆరోపణలు ఆయన దృష్టికి వెళ్లాయి. మారుమూల ఆశ్రమ పాఠశాలల్లో పరిస్థితి మరింత దారుణం గా ఉందన్న ఫిర్యాదులు కూడా ఉన్నా యి.

గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు విద్యాలయాలను తనిఖీ చేస్తున్నప్పటికీ కొన్ని హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం అందించడం లేదు. ఇటీవల పీవో స్వయంగా హుకుం పేట, పెదబయలు మండ లాల్లోని ఆశ్ర మ పాఠశాలలను తనిఖీ చేయగా పలు అక్రమాలు వెలుగు చూశాయి. దీంతో మొదటి తప్పు గా భావించి నోటీసుల తోనే సరిపెట్టారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలోని గిరిజన విద్యాలయాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టు సమాచారం.

ఆశ్రమ పాఠశాలలకు జీసీసీ ద్వారా సరఫరా అవుతున్న నిత్యావసర సరుకుల నాణ్యతపై కూడా పీవో దృష్టిసారించారు. ఇటీవల ఐటీడీఏలో నిర్వహించిన టెండర్ల కార్యక్రమంలో కూడా ఆయన వ్యాపారులను ఇదే హెచ్చరించా రు. ప్రతి హాస్టల్‌కు నాణ్యమైన నిత్యావసర వస్తువులు సకాలంలో పంపిణీ చేయాలని ఆదేశించారు. ఏటీడబ్ల్యూవోలు మండల కేంద్రాలకే పరిమితం కాకుండా రోజువారి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా పీవో తీసుకుంటున్న చర్యలను పలువురు స్వాగతిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు