వైవిధ్య వనం

29 Jun, 2018 12:09 IST|Sakshi
పార్కులో మొక్కలను పరిశీలిస్తున్న బోటనీ విద్యార్థినులు

అంతరించిపోతున్న వృక్షజాతుల సంరక్షణ

ఆదర్శంగా బయోడైవర్సిటీ పార్కు

పెదవాల్తేరు (విశాఖతూర్పు) : మొక్కలు అందరూ పెంచుతారు. అంతరించిపోతున్న వృక్షజాతులను సంరక్షించేవారు కొందరే ఉంటారు. ఇలాంటి వారి ఆలోచనల నుంచి పుట్టిందే జీవ వైవిధ్య పార్కు. నగరంలోని పెదవాల్తేరు రాణీచంద్రమణీదేవి ఆస్పత్రి ఆవరణలోని జీవవైవిధ్య ఉద్యానవనానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ అర్బన్‌ కార్పొరేషన్‌ ఈ పార్కుకు స్పెషల్‌జ్యూరీ అవార్డు ప్రకటించింది. ఆర్‌సీడీ ఆస్పత్రి ఆవరణలోని మూడు ఎకరాల  విస్తీర్ణంలో ఈ పార్కు విస్తరించి ఉంది. ఇక్కడ రెండువేల రకాల వృక్షజాతులను పెంచుతున్నారు. చాలావరకు అంతరించిపోతున్న వృక్షజాతులను ఇక్కడ చూడొచ్చు. వుడా, డాల్ఫిన్‌ నేచర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ జీవ వైవిధ్య పార్కు పచ్చదనంతో కళకళలాడుతోంది. ఈ పార్కుకు పలురకాల వలస పక్షలు వస్తుంటాయి. ఇంకా 130 రకాల సీతాకోక చిలుకలు ముచ్చటగొలుపుతుంటాయి. సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. రామమూర్తి పర్యవేక్షణలో ఈ పార్కు దినదినప్రవర్థమానంగా వెలుగుతోంది. బోటనీ విద్యార్థులకు ఈ పార్కు ఓ ప్రయోగశాలగా ఉపయోగపడుతుందంటే అతిశయోక్తి కాదు.

భవిష్యత్‌ తరాలకు తెలియాలనే...
దేశంలో దాదాపుగా 400 వరకు అంతరించిపోతున్న వృక్షజా తులను ఇక్కడ సంరక్షిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా పది జా తులుగా విభజించి మొక్కలు పెంచుతున్నారు. ఔషధ, సుగం« ద, ముళ్ల, నీటిమొక్కలు, సజీవ శిలాజం, పవిత్రవృక్షాలు, గాలిమొక్కలు, ఆర్కిడ్స్, ఎడారి మొక్కలు ఇక్కడ ఉన్నాయి.

ఆకట్టుకుంటున్న గ్రీన్‌హౌస్‌
బయోడైవర్సిటీ పార్కులో గ్రీన్‌హౌస్‌ను ఒక ప్రత్యేకతగా> చెప్పుకోవచ్చు. ఇక్కడ గాల్లో తేలియాడేలా కుండీలలో మొక్కలు పెంచుతున్నారు. పలురకాల మొక్కలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఈ పార్కు చక్కని ప్రయోగశాలగా ఉపయోగపడుతోంది. వాతవరణ పరిరక్షణ, అధ్యయన, పరిశోధన, అవగాహన కార్యక్రమాలకు డాల్ఫిన్‌ నేచర్‌సొసైటీ వేదికగా నిలవడం విశేషం. నగరంలోని బయోడైవర్సిటీ పార్కుకు ప్రభుత్వ స్పెషల్‌జ్యూరీ అవార్డు రావడంపై పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు