వైఎస్ఆర్ జిల్లా , రాయచోటి రూరల్: స్థానిక మాసాపేట జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులే మధ్యాహ్న భోజన వంటకాలు చేస్తూ కనిపించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు తరగతి గదుల్లో ఉన్న పిల్లలను పిలిపించి, వారి చేతనే కోడి గుడ్లు తెప్పించడం, వాటిని ఉడకబెట్టడంతో పాటు, వంట కాలు తయారు చేసే క్రమంలో భాగంగా పప్పును రుబ్బుతూ కనిపించారు. వంట మనుషులు ఉన్నా కూడా విద్యార్థుల చేత ఇటువంటి పనులు చేయించడం ఏమిటని పలువురు విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
చదువు కోవాల్సిన విద్యార్థులు ఇలా వంట పనులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై హెచ్ఎం మడితాటి నరసింహారెడ్డిని వివరణ కోరగా మేము విద్యార్థులెవరికీ వంట చేయాలని పంపలేదని, ఈ విధంగా విద్యార్థులను ఎవరు పిలిపించారో వెంటనే విచారణ చేసి, వంట ఏజెన్సీ నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తామన్నారు.