హెచ్‌ఎంపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆందోళన

29 Nov, 2013 06:05 IST|Sakshi

నార్నూర్, న్యూస్‌లైన్ : నార్నూర్‌లోని కస్తూరిబా గాంధీ విద్యాలయం(కేజీబీవీ) ప్రత్యేకాధికారి, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వసంత్‌రావ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆశ్రమ, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు ఆందోళనకు దిగారు. 500 మందికి పైగా విద్యార్థినులు పాఠశాల నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ‘మా సారు మాకే కావాలి, వసంత్‌రావ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలి’ అంటూ నినదించారు. ట్రెయినీ ఎస్సై రమేశ్ సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. ర్యాలీలు, ఆందోళనలతో సమస్యలు పరిష్కారం కావని, పాఠశాల ఆవరణలోనే సమస్య పరిష్కరించుకోవాలని సూచించా రు.

గ్రామ పెద్దలు జోక్యం చేసుకోవడంతో పాఠశాలకు చేరుకుని ఆవరణలో బైఠాయించారు. మధ్యా హ్న భోజనం చేయడానికి నిరాకరించగా కౌన్సెలింగ్ చేసి ఆందోళన విరమింపజేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఏటీడబ్ల్యూవో చందన పాఠశాలను సందర్శించారు. వసంత్‌రావ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని విద్యార్థినులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఏటీడబ్ల్యూవో సూచించారు. చదువు కావాలా.. సారు కావాలా అంటూ సున్నితంగా మందలించారు. రెండ్రోజుల్లో వేరే ఉపాధ్యాయులను నియమిస్తామని, చదువుకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకుంటామని హామీనివ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. ఆమె వెంట పీఆర్టీయూ మండల అధ్యక్షుడు రాథోడ్ ఉత్తం,  పాఠశాల ఉపాధ్యాయుడు జగన్నాథ్ ఉన్నారు.
 

మరిన్ని వార్తలు