సమైక్యాంధ్రకు మద్దతుగా కశింకోటలో మంగళవారం విద్యార్థినీ విద్యార్థులు జాతీయ రహదారిపై క్రికెట్ ఆడుతూ వినూత్న నిరసన తెలిపారు. బయ్యవరం, నరసింగబిల్లి, జి.భీమవరం గ్రామాల్లో మానవహారాలు, బంద్, ర్యాలీలు జరిగాయి. కశింకోటలో ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సమైకాంధ్ర వర్ధిల్లాలి, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థినులు మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం రోడ్డుపై క్రికెట్ ఆడారు. ఉపాధ్యాయ జూనియర్ కళాశాల విద్యార్థులు పడమటమ్మ ముఖద్వారం వద్ద మానవహారం నిర్వహించారు. కార్యక్రమానికి శరగడం సుదర్శనం నాయకత్వం వహించారు.
నరసింగబిల్లిలో బంద్, మానవహారం
నరసింగబిల్లిలో సమైక్యాంధ్రకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్, రాస్తారోకో, మానవహారం నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కోన వీర వెంకట సత్యనారాయణ, జెర్రిపోతుల నూకునాయుడు, కోన సోమేష్, కోన నాగ వెంకట సురేష్ల ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ జరిపారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జి.భీమవరం గ్రామంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. అనకాపల్లి-నర్సీపట్నం మార్గంలో ఈ కార్యక్రమం జరిగింది. బయ్యవరంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు.