అందుకు కారణం మహానేత వైఎస్సార్

27 May, 2020 14:59 IST|Sakshi

సాక్షి, అమరావతి : గ్రామీణ యువతకు అధిక ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ట్రిపుల్‌ ఐటీలను ప్రారంభించారని, ఆయన ఆలోచన చేయటమే కాకుండా పెద్ద మనసుతో ఇడుపుల పాయలోని ట్రిపుల్‌ ఐటీకి పెద్ద మొత్తంలో భూమిని ఇచ్చారని ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధిని ఏ. నాగలావణ్య తెలిపారు. వందలాది ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధులు మంచి ఎమ్‌ఎన్‌సీలలో ఉద్యోగాలు సంపాదిస్తున్నారంటే అందుకు కారణం మహానేత వైఎస్సార్ అంటూ కొనియాడారు‌. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల తరపున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్సార్‌ ట్రిపుల్‌ ఐటీలను ప్రారంభించి ఒక అడుగు ముందుకు వేస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌ ఒకటవ తరగతినుంచే ఇంగ్లీష్‌ మీడియం అంటూ రెండు అడుగులు ముందుకు వేశారన్నారు.

బుధవారం మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ విద్యారంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నాడు-నేడు, ఇంగ్లిష్‌ మీడియం విద్య, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించారు. విద్యారంగ నిపుణులు, లబ్ధిదారులతో సీఎం వైఎస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్ధులు ఆయనతో ముచ్చటించారు.

సీఎం జగన్‌ పండుగలా దిగివచ్చారు : కే. గౌతమ్‌, నిడమనూరు
‘‘ఇంగ్లీషు నేర్చుకోవటం ద్వారా ప్రపంచస్థాయి యూనివర్శిటీలలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు సంపాదించవచ్చు. ఇంగ్లీష్‌ విద్య ద్వారా అన్ని రకాలుగా అభివృద్ది చెందవచ్చు. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్ధులు ఇంగ్లీష్‌ మీడియంలో చదవటం వల్ల కార్పోరేట్‌ విద్యార్థులకు ధీటుగా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. నేను ఇప్పుడే పదోతరగతి పూర్తి చేసుకున్నాను. మీలాంటి నేతలు ముందే ఉంటే ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకునేవాడిని. మా తమ్ములకు,చెల్లెళ్లకు ఈ అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టిన మీకు ఎంతో రుణపడి ఉంటాము. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల జీవితాల్లోకి పండుగలా దిగివచ్చారు.. వారి జీవితాల్ని రంగులమయం చేశారు’’

మరిన్ని వార్తలు