విద్యుత్ పొదుపు పాటిస్తేనే సబ్సిడీ: మహంతి

17 Jan, 2014 01:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పరిశ్రమలకు ఇక నుంచి విద్యుత్ పొదుపు పాటిస్తేనే విద్యుత్ సబ్సిడీ అందనుంది. ఈ కొత్త విధానంపై పరిశ్రమలశాఖ అధ్యయనం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంధన పొదుపు మిషన్ (ఎస్‌ఈసీఎం) చైర్‌పర్సన్ పి.కె. మహంతి తెలిపారు. నిర్ణయించిన మేరకు విద్యుత్ పొదుపు చేస్తేనే రాయితీ ఇస్తామని, దీనిపై త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులతో ఆయన సచివాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.       
 
 సీఎస్ చెప్పిన ముఖ్యాంశాలు: అన్ని ప్రభుత్వశాఖల్లో విద్యుత్ పొదుపు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించామన్నారు.  ఎల్‌ఈడీ బల్బులతో అధిక విద్యుత్ వినియోగాన్ని నివారించవచ్చన్నారు.  వ్యవసాయ మోటార్లు పాడైనపుడు రీ-వైండింగ్‌ను స్థానికంగా చేయిస్తున్నారని.. అది నాణ్యత లేకపోవడంతో విద్యుత్ అధికంగా ఖర్చవుతోందని తేలిందన్నారు. అందువల్ల గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా రీ-వైండింగ్ చేసే అంశంపై సమావేశంలో చర్చ జరిగిందన్నారు.  అనంతపురం, గుంటూరు, హైదరాబాద్, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, తిరుపతి, వైజాగ్ నగరాల్లో వీధి దీపాలకు ప్రస్తుతం 186 ఎంయూలను వినియోగిస్తున్నారు. దీనిని 93 ఎంయూలకు తగ్గించుకోవచ్చన్నారు.  మంచి గాలి, వెలుతురు ఉండే విధంగా బిల్డింగ్‌లు నిర్మించాలనే ఉద్దేశంతో రూపొం దిస్తున్న బిల్డింగ్ కోడ్‌ను ఆగస్టు 15 నుంచి అమల్లోకి తెస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు