విజయోస్తు..!

12 Mar, 2014 02:28 IST|Sakshi

వైవీయూ, న్యూస్‌లైన్ : జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు జనరల్ విభాగంలో 21,597 మంది పరీక్షలు రాస్తుండగా 869 మంది ఒకేషనల్ విభాగంలో పరీక్షలు రాయనున్నారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 19,643 మంది జనరల్ విభాగంలోను, 784 మంది వృత్తివిద్యావిభాగంలో పరీక్షలకు హాజరుకానున్నారు.
 
 23 ప్రభుత్వ కళాశాలలు, 4 సాంఘిక సంక్షేమ కళాశాలలు, 17 ఎయిడెడ్, 44 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలల్లో మొత్తంగా 88 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అందుబాటులో మంచినీరు, ఓహెచ్ ప్యాకెట్లతో పాటు ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచనున్నారు.
 
 అలాగే మొత్తం మీద 19 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటిపై ప్రత్యేక పర్యవేక్షణ పెట్టనున్నారు. అయితే విద్యార్థులను 8.30 నిమిషాలకే పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తామని, 8.45 తర్వాత విద్యార్థి వివరాలు, ఆలస్యానికి గల కారణాలు నమోదు చేసుకుని అనుమతిస్తామని, 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు పేర్కొంటున్నారు. 5 ఫ్లైయింగ్ స్క్వాడ్, 10 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు డీఈసీ సభ్యుల బృందాలు పరీక్షలను తనిఖీ చేయనున్నాయి. వీటితో పాటు పరీక్ష కేంద్రం వద్ద జిరాక్స్ సెంటర్‌లను మూసివేయడంతో పాటు 144 సెక్షన్‌ను అమలుచేయనున్నారు.
 
 ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు
 కడప అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. నలుగురికి మించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడి ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు పరీక్ష నిర్వహించే సమయంలో మూసివేయాలన్నారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు