రాజమహేంద్రవరం క్రైమ్: తమకు కరోనా సోకిందేమోననే అనుమానం భార్యాభర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గోపాలనగర్ పుంత ప్రాంతంలో ఆర్.సతీష్ (40), అతని భార్య వెంకటలక్ష్మి (35) నివాసముంటున్నారు. వీరికి వివాహమై 20 ఏళ్లైనా పిల్లలు లేరు. సతీష్ ఆటో డ్రైవర్. వెంకటలక్ష్మి ఇళ్లలో పాచిపని చేసుకునేది. ఇద్దరికీ కిడ్నీ, ఆర్థిక సమస్యలున్నాయి.
ఫైనాన్స్లో తీసుకున్న ఆటోకు వాయిదాలు చెల్లించలేదు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దంపతులకు ఇటీవల కరోనా వైరస్ సోకిందేమోనని అనుమానం ఎక్కువైంది. దీంతో ఇంటి సమీపంలోని స్కూల్ వద్ద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని ఆర్థిక, అనారోగ్య సమస్యల వల్లే ఇలా చేసినట్టు వారు రాసిన లేఖలో పేర్కొన్నారు.