ఉడికిపోతున్న జనం భగ్గుమంటున్న ఎండలు

21 Apr, 2014 02:59 IST|Sakshi
ఉడికిపోతున్న జనం భగ్గుమంటున్న ఎండలు

విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్: ‘‘ఒరేయ్ శ్రీను ఏటిరా ఈ ఎండలు,  ఉదయం 9 గంటలకే నెత్తి సుర్రుమంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే నెలలో ఎలా ఉం టుందోరా’’ అంటూ మండే ఎండల గురించి  జనం చర్చించుకుంటూ వగరుస్తున్నారు. ఓవైపు సెగలుకక్కుతున్న ఎండలు, మరోవైపు విద్యుత్‌కోతతో అల్లాడిపోతున్నారు.

ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో బయటకు రావడానికి భయపడుతున్నారు. రోడ్లన్నీ  ఉదయం తొమ్మిది గంటల తర్వాత నిర్మూనుష్యమవుతున్నాయి. మే,జూన్ నెలలను తలపించే ఎండలతో బెంబేలెత్తిపోతున్నారు. వేడి గాలులు కూడా తోడవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ముఖ్యంగా పిల్లలు, రోగులు, గర్భిణులు, శస్త్రచికిత్సలు చేసుకున్నవారు, బాలింతలు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు  తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అగ్నిప్రమాదాలకు గురై, చికిత్స పొందతున్న వారిక   పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలుగా నమోదవుతున్నాయి.   

  రెక్కాడితే గాని డొక్కాడని భవన నిర్మాణ కార్మికులు, ఫుట్‌పాత్ వ్యాపారులు, రిక్షా కార్మికులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొడుగులు, టోపీలు ధరించకుండా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి కూలీలు అయితే 10 గంటలకే పనిముగించేసుకుంటున్నారు. తగిన  జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పటికే పలువురు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు.

 శీతలపానీయాలను ఆశ్రయిస్తున్న జనం:
  ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతలపానీయాలను ఆశ్రయిస్తున్నారు. పళ్లరసాలు, కూల్‌డ్రింక్స్, కొబ్బరి బొండాలు,  ఫ్రూట్ సలాడ్ వంటి వి తీసుకుంటున్నారు. దీంతో వీటి విక్రయాలు బాగా పెరిగాయి.
 
  అప్రమత్తంగా ఉండాలి

ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైయితే తప్ప బయటకు వెళ్లకూడదు. గొడుగు లేదా టోపీ, కళ్లద్దాలు ధరించి వెళ్లాలి. చర్మవ్యాధిగ్రస్తులు, పిల్లలు, వృద్ధులు ఎండలోకి వెళ్లరాదు.
 - బి.వెంకటేష్, పిల్లలు వైద్యుడు, కేంద్రాస్పత్రి
 
 2012


 తేదీ    గరిష్టం    కనిష్టం
15       33    25
 16      35    27
 17      37    29
 18      39    30
 19      36    29


 2013
 15      35    27
 16      34    30
 17      38    30
 18      38    30
 19      37    28


 2014

15      37    28
 16      37    27
 17      37    29
 18      36    20
 19      37    29

మరిన్ని వార్తలు