కాకినాడ మేయర్‌గా సుంకర పావని

17 Sep, 2017 01:21 IST|Sakshi
కాకినాడ మేయర్‌గా సుంకర పావని
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్‌గా సుంకర పావని ఎన్నికయ్యారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు శనివారం కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరిగింది. అంతకు ముందు టీడీపీ కార్యాలయంలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణ పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు.

తొలుత అడ్డూరి వరలక్ష్మి అభ్యర్థిత్వం ఖరారైందని ప్రచారం జరిగినా చివరి క్షణంలో సుంకర పావని పేరు తెరపైకి వచ్చింది. దీన్ని చినరాజప్ప అధికారికంగా ప్రకటించిన అనంతరం టీడీపీ కార్పొరేటర్లు కౌన్సిల్‌కు చేరుకుని ఆమెను ఎన్నుకున్నారు. డిప్యూటీ మేయర్‌గా కాలా సత్తిబాబు ఎన్నికయ్యారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన సుంకర లక్ష్మీ ప్రసన్న, ఎమ్మెల్యే వనమాడి ప్రతిపాదించిన అడ్డూరి వరలక్ష్మిలకు నిరాశ ఎదురైంది. మేయర్‌ పదవిని ఆశించిన మాకినీడి శేషుకుమారి తనకు అవకాశం దక్కకపోవడంతో పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి కన్నీళ్లతో నిష్క్రమించారు. 
మరిన్ని వార్తలు