జనవరి 29కి ఓటుకు కోట్లు కేసు వాయిదా

22 Nov, 2018 13:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్ధాయిలో పెనుదుమారం రేపిన ఓటుకు నోటు కేసును సర్వోన్నత న్యాయస్ధానం వచ్చే ఏడాది జనవరి 29కి వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసులో తన తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించుకోవాలని గతంలో కోర్టు జెరూసలెం మత్తయ్యకు సూచించగా, కోర్టే న్యాయవాదిని కేటాయించాలని మత్తయ్త కోరారు.

కాగా ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు కేసులో కుమ్మక్కయ్యాయని సుప్రీం కోర్టుకు మత్తయ్య నివేదించారు. డీజీపీ తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని, తనకు ప్రాణహాని లేదని ఆయన నివేదిక ఇచ్చారని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. మత్తయ్యకు అమికస్‌ క్యురిగా సిద్ధార్ధ్‌ ధవేను నియమించిన సుప్రీం కోర్టు మత్తయ్యకు తెలంగాణ డీజీపీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని ఆదేశించింది.

కేసులో తనను ఇంప్లీడ్‌ చేయాలని ఉదయ్‌ సింహ పిటిషన్‌ దాఖలు చేశారు. కేసును జాప్యం చేసేందుకే పిటిషన్లు వేస్తున్నారని తెలంగాణ ఏసీపీ తరపు న్యాయవాది హరీన్‌ రావల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉదయ సింహ తరపు న్యాయవాది సిద్ధార్థ లుత్రా, హరీన్‌ల మధ్య వాడివేడి వాదనలు సాగాయి. ఇక ఉదయ్‌ సింహ ఇంప్లీడ్‌ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోని సుప్రీంకోర్టు కేసు తదుపరి విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు బృందం కోట్ల రూపాయలు లంచం ఇవ్వజూపిన కేసులో నిందితుల్లో మత్తయ్య ఒకరు.

మరిన్ని వార్తలు