పాత పద్ధతిలోనే మెడికల్‌ కౌన్సెలింగ్‌..

24 Aug, 2018 14:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం

సాక్షి, న్యూఢిల్లీ: పాతపద్ధతిలోనే మెడికల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్‌ 550కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైద్య ఆరోగ్యశాఖ సుప్రీంలో అప్పీలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం.. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ పాత పద్దతి ప్రకారమే మెడికల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సూచించింది. అంతేకాకుండా జీవో 550లో మార్పులు చేయాలని కూడా పేర్కొంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన విద్యార్థి ఎవరైనా ఒక మెడికల్‌ కాలేజీలో ఓపెన్‌ కేటగిరీలో సీటు పొంది చేరాక, అతనికి మరో మంచి కాలేజీలో రిజర్వేషన్‌ కేటగిరీలో సీటు వస్తే అక్కడ చేరుతున్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఖాళీ చేసిన ఓపెన్‌ కేటగిరీ సీటును అదే రిజర్వేషన్‌ విద్యార్థికి కేటాయించేలా గతంలో ప్రభుత్వం జీవో నంబర్‌ 550 తీసుకొచ్చింది. ఈ జీవోపై ఇటీవల స్టే ఇచ్చిన హైకోర్టు, తర్వాత ఆ స్టేను సమర్థ్ధిస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు ఆగస్టు 31లోపు దేశ వ్యాప్తంగా మెడికల్‌ కౌన్సెలింగ్‌లు పూర్తి చేయాలి. ఇప్పటికే జాతీయస్థాయి కౌన్సెలింగ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో సీట్ల భర్తీ ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది.

మరిన్ని వార్తలు