తూర్పుగోదావరిలో కరోనా కలకలం!

4 Mar, 2020 07:05 IST|Sakshi

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా సోకినట్లు అనుమానం

సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని కొత్తపేట మండలం వాడపాలెం వాసికి కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వివరాలు.. విధుల్లో భాగంగా దక్షిణకొరియా వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వారం క్రితం సొంతూరు వాడపాలెం చేరుకున్నాడు. మూడు రోజులపాటు అక్కడే ఉన్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా సోకి ఉండొచ్చని హైదరాబాద్‌ నుంచి తూర్పుగోదావరి కలెక్టర్‌కు అధికారులు సమాచారం అందించారు.
(చదవండి: 'కోవిడ్‌' కేర్‌)

దీంతో అర్థరాత్రి వాడపాలెం చేరుకున్న ప్రభుత్వ యంత్రాంగం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గురించి ఆరా తీయగా.. అతను వాడపాలెం నుంచి అత్తగారిల్లు గోదాశివారిపాలెంకు వెళ్లినట్లు తెలిసింది. హుటాహుటిన ముమ్మిడివరం మండలం గోదాశివారిపాలెంకు చేరుకున్న అధికారులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా సోకిందా? లేదా? అని నిర్ధారించేందుకు అతన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అతని భార్య, అత్తగారింట్లోనివారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

ముందస్తు చర్యలు తీసుకున్నాం..
వాడపాలెం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కరోనా అనుమానిత కేసు వివరాలను వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తూర్పు గోదావరి జిల్లా వైద్య అధికారులను ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రజలు భయాందోళన పడాల్సిన అవసరం‌ లేదని మంత్రి స్పష్టం చేశారు.
(చదవండి: కోవిడ్‌పై ఆందోళన వద్దు)
బస్సులో ఉన్నప్పుడు వైరస్‌ లేదు! 
 

>
మరిన్ని వార్తలు