సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) నేపథ్యంలో ఈ నెల 28 వరకు హైకోర్టు విధులు నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, విజయవాడ మెట్రో పాలిటన్ కోర్టుల విధులను సస్పెండ్ చేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఈ మేరకు సర్క్యులర్ జారీ చేశారు. కాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఆదేశాల మేరకు.. కరోనా కట్టడికి తమ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, సందర్శకుల విషయంలో న్యాయస్థానం ఇటీవల కఠిన మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.(గుండెపోటుతో ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ మృతి)
‘‘హైకోర్టు అధికారులు, సిబ్బంది ముందస్తు అనుమతి లేకుండా హెడ్క్వార్టర్స్ను విడిచి వెళ్లకూడదు. ఒకవేళ అనుమతి లేకుండా వెళితే దాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. ఎవరైనా అనుమతి తీసుకుని రాష్ట్రం దాటితే, తిరిగి విధుల్లోకి వచ్చే ముందు విధిగా క్వారంటైన్లోకి వెళ్లితీరాలి. హైకోర్టు ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి. అనంతరం మాస్కులు ధరించినవారినే లోపలికి అనుమతిస్తారు. జ్వరం, కోవిడ్ లక్షణాలున్న వారిని కోర్టు ప్రాంగణంలోకి అనుమతించబోరు’’ వంటి పలు నిబంధనలు న్యాయస్థానం విధించింది.