స్విమ్స్ మెడికల్ కళాశాల అడ్మిషన్లపై మల్లగుల్లాలు

9 Aug, 2014 04:26 IST|Sakshi

తిరుపతి: స్విమ్స్‌కు అనుబంధంగా ఏర్పాటవుతున్న శ్రీపద్మావతి మహిళా మెడికల్ కళాశాలలో అడ్మిషన్ల విషయమై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. 150 సీట్ల సామర్ధ్యంతో కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతితో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు లభించడంతో ఈ విద్యా సంవత్సరం నుంచే కోర్సులు ప్రారంభించాలని స్విమ్స్ అధికారులు నిర్ణయించారు. మెడికల్ కళాశాల కోసం సుమారు రూ.70 కోట్లతో భవన నిర్మాణాలు దాదాపు పూర్తయ్యా యి.

అయితే మిగతా పనులు పూర్తి కావడానికి నెలన్న ర రోజులు పట్టే అవకాశం ఉండడంతో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాలా వద్దా అనే ఆలోచనలో స్విమ్స్ అధికారులు పడ్డారు. హడావిడిగా అడ్మిషన్లు కానిచ్చి ఆ తర్వాత విమర్శలు ఎదుర్కోవడం ఎందుకని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎస్వీ మెడికల్ కళాశాల కు అనుబంధంగా మంజూరైన 300 పడ కల ఆస్పత్రిని పద్మావతి మెడికల్ కళాశాలకు అనుబంధం చేస్తూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 78 వివాదాస్పదంగా మారింది.

మెడికల్ కళాశాల విద్యార్థులు ఈ జీవోను వ్యతిరేకిస్తున్నారు. మాతా, శిశు సంరక్షణ కోసం పనిచేస్తూ రాయలసీమలోనే అతి పెద్దదైన తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రి సేవల విస్తృతిలో భాగంగా ఏర్పాటు చేసిన 300 పడకల ఆస్పత్రిని స్వి మ్స్ మెడికల్ కళాశాలకు అప్పగించడాన్ని నిరసిస్తూ వారు ఉద్యమబాట పట్టారు. మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలంటే అనుబంధంగా జనరల్ ఆస్పత్రి కలిగి ఉండాలని ఎంసీఐ నిబంధన ఉంది. 300 పడకల ఆస్పత్రి కోసం ఎస్వీ మెడికల్ విద్యార్థులు చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నా యి.

ఈ నేపథ్యంలో పద్మావతి మెడికల్ కళాశాలకు అనుబంధంగా మరో జనరల్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తారా అన్నది ప్రశ్నగా ఉంది. అయితే మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నపుడు మాతా, శిశు సంరక్షణ కోసం ఉద్దేశించిన 300 పడకల ఆస్పత్రిని ఆ కళాశాలకు అప్పగించడమే సబబుగా ఉంటుందన్న వాదన వినిపిస్తోం ది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి అడ్మిషన్ల జోలికి పోకుండా అడ్డంకులన్నీ తొలగిపోయిన తర్వాత వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభించాలనే యోచనలో కూడా స్విమ్స్ అధికారులు ఉన్నట్టు తెలిసింది.
 

మరిన్ని వార్తలు