గుడివాడలో స్వైన్‌ఫ్లూ కలకలం

7 Nov, 2018 06:48 IST|Sakshi
మృతిచెందిన దుక్కెటి నర్శింహమూర్తి (ఫైల్‌ఫొటో)

జిల్లాలో స్వైన్‌ఫ్లూతో మరొకరి మృతి

ఆలస్యంగా వెలుగు చూసిన వైనం

అప్రమత్తం కాకుంటే మరింత ప్రమాదమే...

విజయనగరం, భోగాపురం(నెల్లిమర్ల): జిల్లాలో మరో స్వైన్‌ఫ్లూ మరణం చోటు చేసుకుంది. ఇక్కడ అనా రోగ్యం బారినపడి విశాఖలో ఇప్పటికే కొందరు చికిత్స పొందుతున్న సంగతి తెలి సిందే. ఇటీవలే సాలూరుకు చెందిన ఓ మహి ళ మృతి చెందగా... తాజాగా భోగా పురం మండలం గుడివాడలో ఓ మాజీ సైనికోద్యోగి ఈ వ్యాధితో మృతి చెందారు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.  గ్రామానికి చెందిన దుక్కెటి నర్సింహమూర్తి(46) ఆర్మీలో పనిచేస్తూ నాలుగు మాసాల క్రితమే పదవీ విరమణ పొందారు. మద్యానికి బానిసైన ఈయన గతనెల 27నుంచి ఆరోగ్యం బాగోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో కల్యాణి ఆస్పత్రిలో చికిత్సకోసం వెళ్ళి వస్తుండేవారు. అప్పుడప్పుడు భోగాపురంలోని రెవెన్యూ కార్యాలయానికి ఏవో ధ్రువపత్రాలకోసం వస్తుండేవారు. విశాఖలో ఆయ న్ను పరీక్ష చేసిన వైద్యులు గ్యాస్ట్రిక్‌తో బాధపడుతున్నట్లు గుర్తించి దానికి సంబంధించిన వైద్యం చేశారు. అయితే కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి 31న స్వైన్‌ ఫ్లూ పరీక్షలకు అవసరమైన నమూనాలుఅందజేశారు. ఉన్నట్టుండి ఈ నెల 3న ఆయన మృతి చెందగా... గుండెపోటు వల్ల చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కానీ ఈ నెల 5న స్వైన్‌ఫ్లూ పరీక్షల ఫలితాలు వచ్చాయి. దానిలో స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ ఉన్నట్లు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

అప్రమత్తమైన వైద్య సిబ్బంది
విషయం తెలుసుకున్న పోలిపల్లి పీహెచ్‌సీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వైద్యాధికారి సునీల్‌తో సహా సిబ్బంది గ్రామానికి బుధవారం వెళ్ళి, మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్వైన్‌ ఫ్లూ ప్రబలకుండా కుటుంబ సభ్యులకు మందులు అందించారు. అలాగే ఇంటి చుట్టు పక్కల ఎవరికైనా స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నదీ, లేనిదీ పరిశీలించారు. ఎవరికీ ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

విశాఖలో కల్యాణి ఆస్పత్రికి నర్సింహమూర్తి రోజూ వెళ్ళి వచ్చేవాడని, ఆ క్రమంలో అక్కడ ఎవరినుంచైనా మృతుడికి వ్యాధి సంక్రమించి ఉండవచ్చునని వైద్యాధికారి సునీల్‌ అభిప్రాయపడ్డారు. అలాగే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి స్వైన్‌ఫ్లూ మందులు పంచిపెట్టారు. అలాగే ఆటోద్వారా గ్రామంలో స్వైన్‌ ఫ్లూ వ్యాధి గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే ఆశకార్యకర్తల సమావేశం నిర్వహించారు. గ్రామంలో దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పితో ఎవరైనా బాధపడుతున్నట్లయితే వెంటనే గుర్తించి అవసరమైన మందులు అందించాలని తెలిపారు. స్వైన్‌ ఫ్లూ వ్యాధి గురించి అవగాహన కల్పించాలని సూచించారు.  కార్యక్రమంలో పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు