దిగ్విజయ్‌కు టీఆర్‌ఆర్ ఆతిథ్యం

1 Feb, 2014 05:29 IST|Sakshi

పరిగి, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు శుక్రవారం రాత్రి పరిగిలో పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి  ఘన స్వాగతం పలికారు. కర్ణాటకలోని గుల్బర్గాలో శనివారం నిర్వహించనున్న సోనియా సభకు వెళ్తూ ఆయన పరిగిలో గంటపాటు గడిపారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాత్రి 7.30 గంటలకు నేరుగా పరిగికి చేరుకున్న దిగ్విజయ్‌సింగ్ స్థానిక ఇందిరాగాంధీ చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

అక్కడే ఆయనకు కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన దిగ్విజయ్.. పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. రాత్రి భోజనంగా చపాతీ, నాన్‌వెజ్ కర్రీ తీసుకున్నారు. అనంతరం కాసేపు కార్యకర్తలతో ముచ్చటించారు. ఉద్యోగ సంఘాలు, విద్యార్థి జేఏసీ నాయకులు ఆయన్ను కలిసి తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

 పరిగి టికెట్ ఎవరికి ఇస్తారని కొందరు కార్యకర్తలు, విలేకరులు అడగ్గా ఆ విషయం మీకే తెలుసు  అంటూనే.. ఎవరు బాగా పనిచేస్తే వారికే వస్తుందని సమాధానమిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కష్టపడాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకు డు భాస్కర్.. దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి పం చాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రెగ్యులరైజ్ చేసి న జీఓను ఆయన నుంచి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు