రమణమ్మ కుటుంబాన్ని ఆదుకుంటాం

12 Sep, 2019 12:30 IST|Sakshi
రమణమ్మ పిల్లలు

సౌదీలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన రమణమ్మ

బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడిన తహసీల్దార్‌    

నెల్లూరు  ,మర్రిపాడు: సౌదీలోని రియాద్‌లో మృతిచెందిన మండలంలోని చాబోలు గ్రామానికి చెందిన గుండబోయిన రమణమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారులు తెలిపారు. మర్రిపాడు తహసీల్దార్‌ డీవీ సుధాకర్‌ బుధవారం సిబ్బందితో కలిసి చాబోలుకు చేరుకుని మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. వివరాలు తెలుసుకున్నారు. సౌదీలో ఉంటున్న గ్రామానికి చెందిన వారితో మాట్లాడారు. అనంతరం తహసీల్దార్‌ మాట్లాడుతూ రమణమ్మ రెండున్నర సంవత్సరాల క్రితం ఉపాధి కోసం సౌదీకి వెళ్లినట్లు చెప్పారు. అక్కడి యజమానే ఆమెను హత్య చేసినట్లుగా కుటుంబసభ్యులు చెప్పారని వెల్లడించారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి ఆదేశాల మేరకు సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్‌ఐ సురేంద్ర, వీఆర్వో రమణయ్య ఉన్నారు.  
పాపం పిల్లలు
రమణమ్మ మృతితో ఆమె ఇద్దరు కుమారులు, కుమార్తె తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మృతురాలి భర్త ఐదేళ్ల క్రితం డెంగీతో మృతిచెందాడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో బతుకుదెరువు కోసం రమణమ్మ సౌదీకి వెళ్లింది. కష్టపడి డబ్బు సంపాదించి పిల్లలను బాగా చుసుకోవాలనుకున్న ఆమె కలలు నెరవేరకుండానే చనిపోయింది. చిన్నారులను ఎలా చూసుకోవాలో అంటూ మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు