వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది: తానేటి వనిత

20 Sep, 2019 18:51 IST|Sakshi

సాక్షి, అమరావతి : వికలాంగుల పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. దివ్యాంగులకు, వృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. దివ్యాంగులకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సమర్థవంతంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వృద్ధులకు గ్రామ వాలంటీర్ల ద్వారా పథకాలు అందజేస్తామని, భవిష్యత్తులో జిల్లాకు ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తానేటి వనిత హామీ ఇచ్చారు.

అదే విధంగా అంగన్‌వాడీ కేంద్రాలలో, గర్భిణీలకు, బాలింతలకు నాణ్యమైన భోజనం అందకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 53 శాతం ఎనీమియా ఉందని నీతి ఆయోగ్‌ నివేదిక ఇచ్చిందని, దీనిని త్వరలో మంచి విధానం ద్వారా తగ్గించేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు. 

మరిన్ని వార్తలు