‘దోచుకున్న వాళ్లే ధర్నాకు దిగారు’

30 Aug, 2019 18:04 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఇసుక కొరతపై టీడీపీ నేతలు ధర్నా చేయటంపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇసుకను దోచుకున్న టీడీపీ నేతలే ఇప్పుడు ధర్నా కు దిగుతుంటే జనం నవ్వుకుంటున్నారని ఆమె విమర్శించారు. గత ఐదేళ్లలో టీడీపీ నేతలు ఇసుకను అమ్ముకుని కోట్లు సంపాదించారని ఆరోపించారు. వారి ఇసుక దోపిడీ భరించలేకనే ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న వనజాక్షిపై దాడికి దిగిన టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇసుక కోసం మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారన్నారు.

ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పిన టీడీపీ నేతలు ఏ రోజయినా ఉచితంగా ఇసుకను సరఫరా చేశారా అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. కొత్త ఇసుక పాలసీ వస్తుందని టీడీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. సిమెంట్‌ కంపెనీల కోసం ఇసుక కొరత సృష్టించారన్నది అబద్ధం అని టీడీపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు. సిమెంట్‌ కంపెనీల కోసం ఇసుక కొరత సృష్టించారన్నది అబద్ధమని తేల్చి చెప్పారు. ఇటీవల వరదలు పోటెత్తినందున ఇసుక తవ్వకం సాధ్యం కాలేదని, సెప్టెంబర్‌ 5 నుంచి పూర్తి పారదర్శకంగా ఇసుకను సరఫరా చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు