బొమ్మల మాటున బొక్కే ఎత్తు..!

9 Jan, 2014 02:29 IST|Sakshi

సాక్షి, కాకినాడ :హైదరాబాద్‌లోని టాంక్ బండ్ తరహాలో కాకినాడ బోట్‌క్లబ్‌ను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రిలయన్స్ సంస్థ సమకూర్చిన రూ.60 లక్షలతో ఆధునికీకరించారు. క్లబ్ చుట్టూ కర్బ్‌వాల్ నిర్మించి గ్రావెల్ ట్రాక్ ఏర్పాటు చేశారు. లోపల ఫౌంటెన్లు, ఆధునిక ఎలక్ట్రిక్ స్తంభాలు, లైట్లు, బాలల కోసం వివిధ రకాల ఆట పరికరాలు సమకూర్చారు. వాకర్స్‌కు అవసరమైన మరుగుదొడ్లు నిర్మించారు. పలురకాల మొక్కలు నాటారు. గ్రానైట్ రాతితో మలచిన ఆదికవి నన్నయ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బోయి భీమన్న వంటి కవుల, రఘుపతి వెంకటరత్నంనాయుడు, కందుకూరి వీరేశలింగం వంటి సంస్కర్తల విగ్రహాలను పెడెస్టళ్లపై ప్రతిష్టించారు. ఆధునికీకరించిన బోట్‌క్లబ్‌ను గత నవంబర్ 15న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, కలెక్టర్ నీతూ ప్రసాద్‌ల సమక్షంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎంఎంపళ్లంరాజు ప్రారంభించారు. విగ్రహాలను కూడా ఆవిష్కరించారు. నాటి సభలో రిలయన్స్ సమకూర్చిన రూ.60 లక్షలతో బోట్‌క్లబ్‌ను ఆధునికీరించామని కేంద్రమంత్రి ప్రకటించారు.
 
 ఇప్పటికైనా పట్టించుకోండి ప్రత్యేకాధికారి గారూ..
 కాగా ‘నగర పాలక సంస్థ కమిషనర్ అనుమతితో’ అంటూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ నెల ఒకటిన రూ.18.03 లక్షలు వ్యయమయ్యే 19 పనులకు స్వల్పకాలిక టెండర్ నోటీసు జారీ చేశారు. ఆ పనుల్లో ఇప్పటికే క్లబ్‌లో ఉన్న కవులు, సంఘసంస్కర్తల విగ్రహాల ఏర్పా టు, వాటికి పెడెస్టళ్ల నిర్మాణం, గ్రానైట్ రాయి బిగింపు, కొత్త లైట్ల ఏర్పాటు వంటి రూ.9.76 లక్షల విలువైన పది పనులుండడం గమనార్హం. టెండర్ల దాఖలుకు ఈ నెల 9 వరకు గడువని, 10న సాయంత్రం టెండర్లు తె రుస్తామని జారీ అయిన నోటీసులో స్థానికేతరులెవరూ దాఖ లు చేయడానికి వీల్లేని రీతిలో బాక్సు టెండర్‌గా పిలి చారు. సాధారణంగా లక్షలోపు పనులను నామినేషన్ పద్ధతిలో ఇవ్వొచ్చు. ఇప్పటికే  రూ.2.97 కోట్లతో 297 పనులను అడ్డగోలుగా నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిన అధికారులు ఇప్పుడు అంతా అయిపోయి వినియోగంలోకి వచ్చాక విగ్రహాలు, వాటికి పెడెస్టళ్లు, గ్రానైట్ బిగిం పు పేరుతో టెండర్లు పిలవడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.
 
 పైగా రిలయన్స్ నిధులతో జరిగిన ఈ పనులకు మళ్లీ టెండర్లు పిలవడాన్ని బట్టి రూ.9.76 లక్షల కార్పొరేషన్ నిధులను దొడ్డిదారిన పంచుకుకోనున్నారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఒకవేళ క్లబ్ ఆధునికీకరణ పనుల్లో ఇవన్నీ లేవనుకుంటే అప్పుడు ఏ నిధులతో వాటిని చేయించారు, ఆ పనులకు ఇప్పుడెం దుకు టెండర్లు పిలవాల్సి వచ్చింది, ఎవరి ప్రయోజనం ఆశించి ఇలాంటి దొడ్డిదారి పద్ధతులకు తెర తీస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే టెండర్‌లోని మిగిలిన 9 పనులు కూడా ఈ బాపతుగా పూర్తయినవే కావచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకాధికారి, కలెక్టర్ నీతూ ప్రసాద్ జోక్యం చేసుకొని కార్పొరేషన్ అధికారుల అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
 

మరిన్ని వార్తలు