మమ్మీ టాటా..

26 Jun, 2015 03:20 IST|Sakshi
మమ్మీ టాటా..

వారికున్నది ఒక్కగానొక్క కూతురు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. రోజులాగే బడికెళ్లింది. మధ్యాహ్నం అన్నం తినిపించేందుకు నాన్న టీవీఎస్ మోపెడ్‌లో స్కూలు వద్దకు వెళ్లి పాపను ఇంటికి తీసుకొచ్చాడు. భోజనం చేశాక టాటా మమ్మీ అంటూ అమ్మకు వీడ్కోలు పలికి నాన్న వెంట టీవీఎస్‌లో స్కూలుకు బయలు దేరింది. మార్గమధ్యంలో ట్యాంకర్ మృత్యుశకటంలా దూసుకొచ్చి వీరు వెళ్తున్న మోపెడ్‌ను ఢీకొంది. క్షణాల్లో ఆ చిన్నారి మృత్యు కౌగిట్లోకి వెళ్లిపోయింది. కన్నవారికి కడుపుకోత మిగిలింది.
 
 ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో న్యూకాలనీలో నివాసముంటున్న ఎన్. చంద్రశేఖర్, ఉమల ఏకైక కుమార్తె సాయికీర్తన(10). చంద్రశేఖర్ ఐసీఎల్ కర్మాగారంలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. సాయికీర్తన(10) మహాత్మానగర్ కాలనీలోని శ్రీ విజయవాణి హైస్కూల్‌లో ఐదవ తరగతి చదువుతోంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లింది. మధ్యాహ్నం భోజనం కోసం తండ్రి చంద్రశేఖర్ పాపను పాఠశాల నుంచి ఇంటికి తీసుకొచ్చాడు. పాపతో కలిసి అమ్మా..నాన్నలు భోంచేశారు. పాఠశాలకు సమయం కావడంతో అమ్మకు టాటా టాటా చెప్పి  తండ్రితో కలిసి టీవీఎస్ మోపెడ్‌లో స్కూలుకు బయలు దేరింది.

ముద్దనూరురోడ్డులో మహాత్మానగర్ కాలనీకి వెళుతుండగా వెనుక నుంచి ట్యాంకర్ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రి ఎగిరి కింద పడ్డాడు. వెనుక కూర్చున్న సాయికీర్తన తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. విషయం తెలుసుకున్న సీఐ పీటీ కేశవరెడ్డి, ఎస్‌ఐ లక్ష్మినారాయణలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ ముసలయ్య సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది.త ండ్రి  చంద్రశేఖర్, తల్లి ఉమలు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసునమోదు చేసుకోని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టర్ కోరకు చిన్నారి మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు