ఎస్సీ యువకుడిపై టీడీపీ వర్గీయుల దాడి

18 Feb, 2019 11:58 IST|Sakshi
బాధితుడిని పరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.రమేష్‌రెడ్డి

అనంతపురం, తాడిపత్రి అర్బన్‌: ఎస్సీ యువకుడిపై టీడీపీ వర్గీయులు దాడికి తెగబడ్డారు. కారణం లేకుండా విచక్షణారహితంగా చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి. శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం కోమటికుంట్లకు చెందిన గోపాల్‌రెడ్డి మనవడి కేశఖండన కార్యక్రమం తాడిపత్రి పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలోని ఆశ్రమంలో ఆదివారం జరిగింది. మధ్యాహ్నం భోజనాల అనంతరం విస్తరాకులను గ్రామానికి చెందిన నారాయణస్వామి అనే ఎస్సీ యువకుడు ట్రాక్టర్లో వేసుకొని సమీపలోని పెన్నానది పరివాహక ప్రాంతంలో వేయడానికి వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ ఉన్న టీడీపీ వర్గీయులు ఖాదర్‌బాషా మరికొందరు ట్రాక్టర్‌ తాళాలు లాక్కొని నారాయణస్వామిపై రాళ్లతో దాడి చేశారు. తనపై ఎందుకు దాడి చేస్తున్నారో చెప్పండని వేడుకుంటున్నా పట్టించుకోకుండా చావబాదేశారు. తీవ్ర రక్తస్రావమై నారాయణస్వామి అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.రమేష్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారు. అయితే అప్పటికే బాధితుడిని ఆస్పత్రికి తరలించారని తెలిసి అక్కడకు చేరుకుని పరామర్శించారు. దాడికి గల కారణాలను అడిగి తెలుసుకుని నారాయణస్వామికి ధైర్యం చెప్పారు. అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మరిన్ని వార్తలు