అధికార మదంతోనే టీడీపీ దాడులు

18 May, 2014 23:38 IST|Sakshi
అధికార మదంతోనే టీడీపీ దాడులు

 కాకినాడ, న్యూస్‌లైన్ : అధికారం చేతికి రాగానే తెలుగుదేశం నేతలు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని  దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ శెట్టిబత్తుల రాజబాబు ఆరోపించారు. పార్టీ శ్రేణులు సంయమనం పాటించి దాడులను తిప్పికొట్టాలన్నారు. కాకినాడలో ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ కోట్లు కుమ్మరించి అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకున్న టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడున్నారని ధ్వజమెత్తారు. కేవలం 2 శాతం స్వల్ప ఓట్లు తేడాతో అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ అధికారమదంతో విర్రవీగుతుందన్నారు.
 
కాకినాడ ఎంపీ తోటనరసింహం తాను ఎంపీనన్న స్పృహను కూడా కోల్పోయి ఒక వీధి రౌడీలా వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లల్లోకి చొరబడి దాడులకు తెగపడడం చూస్తుంటే మున్ముందు వీరి ఆగడాలు ఏ స్థాయి లో ఉంటాయో అర్థమవుతుందన్నారు. ఎస్సీల ఇళ్లల్లోకి కూడా వెళ్లి ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిపైనా భౌతిక దాడులకు దిగడం టీడీపీ నేతల రౌడీయిజానికి పరాకాష్టగా మారిందన్నారు. ఇదే రీతిలో టీడీపీ శ్రేణులుంటే మాత్రం వైఎస్సార్ సీపీ శ్రేణులు చూస్తూ ఊరుకోబోరని తగిన రీతిలో ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

మరిన్ని వార్తలు