స్కూలా.. ఫంక్షన్‌ హాలా?

16 Jun, 2019 07:01 IST|Sakshi
పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన షామియానాలు

సాక్షి,విశాఖపట్నం : ఎంవీపీ కాలనీ పరిధిలోని వాసవానిపాలెం మత్స్యకార పాఠశాలను టీడీపీ నేతలు తమ ఆగడాలకు అడ్డాగా మార్చేశారు. తమకు నచ్చి నట్టు పాఠశాలను ఉపయోగించుకుంటున్నారు. బడిని ఫంక్షన్‌ హాల్‌ను చేసేశారు. రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా మత్స్యకార విద్యార్థులకు ఆ మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా పాఠశాలను ఇక్కడ అందుబాటులోకి తీసుకురాగా స్థానిక టీడీపీ నాయకుడు పేర్ల మషేన్, 7వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పోలారావు నిరంకుశంగా వ్యవహరిస్తూ పాఠశాలను తమ కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారు. పాఠశాల పనిదినాల్లో ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి ప్రైవేట్‌ కార్యక్రమాలకు పాఠశాల ఆవరణాన్ని యథేచ్ఛగా వినియోగించుకోవడం జరుగుతోంది. శనివారం కూడా ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకొచ్చి పాఠశాల ఆవరణాన్ని పెళ్లిమంటపంగా మార్చేశారు. కాలనీలోని ఓ కుటుంబానికి చెందిన పెళ్లి వేడుక శనివారం రాత్రి జరగనుంది. అయితే మషే న్, పోలారావు ఒక పక్క పాఠశాలలో తరగతులు జరుగుతున్నా ఇక్కడే పెద్ద ఎత్తున షామి యానాలు వేయించారు. అంతేకాదు వంటలను కూడా పాఠశాలలోనే చేయించడం జరిగిం ది. దీంతో తరగతుల నిర్వహణకు తీవ్ర ఆటంకం కలిగించింది. ప్రైవేట్‌ కార్యక్రమాలకు పాఠశాలను వినియోగించడానికి వీల్లేదని స్థానికులు, ఉపాధ్యాయులు గతంలో చెప్పగా మషేన్‌ వారిపై చిందులు తొక్కాడు. దీంతో ఉపాధ్యాయులు ఏం చేయలేకపోతున్నారు. మిన్నకుండిపోవడం వారి వంతవుతోంది. చేసేది లేక పిల్లలను గదిలో ఒక మూలన కూర్చోబెట్టి పాఠాలు చెప్పాలి వస్తోంది. తరచూ ఇక్కడ ఇదే పరిస్థితి ఉంటోం దని విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఉపాధ్యాయులు ఎందుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. 

మరిన్ని వార్తలు