మొక్కుబడిగా...

3 Aug, 2014 02:58 IST|Sakshi

 పార్వతీపురం : ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని మమ అనిపించేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల మొక్కుబడిగా సాగింది. వారం రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఉపాధ్యాయులు, అధికారులు ర్యాలీలకే పరిమితం చేశారు. ముఖ్యంగా పార్వతీపురం సబ్‌ప్లాన్‌లోని మండలాల్లో కొన్ని గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ బడి బయట చాలామంది పిల్లలు ఉన్నారన్నది సత్యం. ఎనిమిది మండలాల్లో సుమారు 700 వరకు డ్రాపౌట్స్ ఉన్నట్టు సమాచారం. వీరిలో కనీసం 50 శాతం మందిని కూడా అధికారులు పాఠశాలల్లో చేర్చలేకపోయూరు. గత ఏడాది 673 మంది వరకు బడిబయట పిల్లలను గుర్తించి ఆ మేరకు పాఠశాలల్లో చేర్పించకపోవడంతో వారంతా పశువులు కాపర్లుగా, బాల కార్మికులుగా మిగి లారు.
 
 ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది.  పార్వతీపురం మండలంలో 56 పాఠ శాలలుండగా, 35 మంది బడిబయట ఉన్న పిల్లలున్నారు. వీరిలో 25 మంది జాయిన్ అయ్యారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో 188 పాఠశాలలుండగా దాదాపు 137మంది వరకు బడిబయట ఉన్న పిల్లలున్నారు. వీరిలో 83మందిని చేర్పించారు. గరుగుబిల్లి మండలంలో 35మంది పిల్లలు డ్రాపౌట్స్ ఉండగా, 9 మంది మాత్రమే చేరారు. అలాగే బలిజిపేట మండలంలోని 38 మంది డ్రాపౌట్స్ ఉండగా 9 మంది మాత్రమే పాఠశాలల్లో చేరారు. ఇలా కనీసం 50 శాతం కూడా బడిబయట ఉన్న పిల్లల్ని బడిలోకి చేర్చకుండా మొక్కు బడిగా ర్యాలీలు, సహపంక్తి భోజనాలతో ‘బడి పిలుస్తోంది’ని మ మ అనిపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు