టీడీపీ దౌర్జన్యకాండ

1 Oct, 2016 08:33 IST|Sakshi
నారాయణరెడ్డి ఇంటి ఆవరణలో టీడీపీ వర్గీయుల దాడిలో ధ్వంసమైన జీపు అద్దాలు
– చెరుకులపాడులో బరితెగింపు 
– నారాయణరెడ్డి వర్గీయులపై దాడి
– ఇంటి ఆవరణలోని జీపు ధ్వంసం
– పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన ఇరువర్గాలు
 
వెల్దుర్తి రూరల్‌: టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. చెరుకులపాడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం దౌర్జన్యకాండకు దిగారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఒక పొలం విషయంలో టీడీపీ వర్గీయులు, వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు ఉన్నాయి. శుక్రవారం నారాయణరెడ్డి వర్గీయులు ట్రాక్టర్‌లో వెళుతుండగా నలుగురు టీడీపీ కార్యకర్తలు అటకాయించారు. ట్రాక్టర్‌కు ఉన్న రాడ్‌తోనే దాడికి పూనుకున్నారు. హఠాత్పరిమాణానికి హతాశయులైన నారాయణరెడ్డి వర్గీయులు పరుగుతీశారు. గ్రామంలోని నారాయణరెడ్డి ఇంట్లో తలదాచుకున్నారు.

టీడీపీ కార్యకర్తలు ఇంటి ఆవరణలో ఉన్న జీపును పాక్షికంగా ధ్వంసం చేశారు. ఇది తెలుసుకున్న గ్రామస్తులు వారిపై తిరుగబడేలోపు రాళ్లదాడి చేస్తూ అక్కడినుంచి తప్పించుకున్నారు. నారాయణరెడ్డి వర్గీయులు వెల్దుర్తి పోలీసులను ఆశ్రయించగా..దాడి చేసిన వారుసైతం ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న డోన్‌ సీఐ శ్రీనివాసులు, కష్ణగిరి ఎస్‌ఐ సోమ్లానాయక్‌ తమ సిబ్బందితో కలిసి గ్రామానికి నారాయణరెడ్డి ఇంటికి వెళ్లి ఆవరణలో ఉన్న ధ్వంసమైన జీపును పరిశీలించి సంఘటన గూర్చి గ్రామస్తులతో విచారించారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు వారు తెలుపుతున్నారు.

ఇంత ఘోరమా
దాడి విషయంపై నారాయణరెడ్డి ఫోన్‌లో స్పందిస్తూ ప్రస్తుతం కర్నూలులో తాను ఇంట్లో ఉన్నానన్నారు. ఇది టీడీపీ నాయకుల కుట్ర.  తనపై దాడి చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇదంతా జరుగుతోందన్నారు. నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు గ్రామంలో చిచ్చపెట్టాలని చూస్తున్నారన్నారు. వీటికి పోలీసులు పుల్‌స్టాప్‌ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.  
 
మరిన్ని వార్తలు