వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ ఎంపీటీసీ దాడి

24 Jun, 2019 09:46 IST|Sakshi

సాక్షి, టెక్కలి( శ్రీకాకుళం) : మండలంలోని చాకిపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త పంగ సన్యాసిరావుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు పంగ వసంతరావు రాడ్డుతో గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ఎంపీటీసీ చెబితే వినకుండా వైఎస్సార్‌సీపీ నాయకులతో కలసి పనిచేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీన్ని మనసులో పెట్టుకుని ఎంపీటీసీతోపాటు, పంగ చంద్రరావు, పంగ రాము, పంగ కాంతమ్మ శనివారం రాత్రి తన ఇంటి మెట్లు ఎక్కుతున్న సన్యాసిరావును వెనక్కి లాగి తీవ్రంగా భౌతిక దాడికి పాల్పడ్డారు. ఇదేక్రమంలో భుజంపై ఇనుప రాడ్డుతో కొట్టి గాయపరిచారు. తీవ్ర గాయాలు కావడంతో టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   


 

మరిన్ని వార్తలు