అంతా నా ఇష్టం

19 Mar, 2019 12:37 IST|Sakshi
స్టేడియం స్థలం

స్టేడియం నిర్మాణంలో కలగజేసుకున్న బీద మస్తాన్‌రావు

ఇంజినీర్లకు డిజైన్‌ మార్చాలని హుకుం

రూ.60 కోట్ల విలువైన స్థలం నాశనం

సాక్షి, కావలి (నెల్లూరు): కావలిలో టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి జరగనివ్వడం లేదు. అందులో ప్రధానమైనది కావలి పట్టణంలోని స్టేడియం. రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన కావలి పట్టణం గత 50 ఏళ్లుగా జిల్లాలో విద్యాసంస్థల హబ్‌గా ఉంది. ప్రకాశం జిల్లా ను ఆనుకుని కావలి పట్టణం ఉండటంతో ఆ జిల్లాకు చెందిన విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడి  విద్యా సంస్థల్లో చదువుకుంటుంటారు. అలాగే క్రీడల్లో రాణించేవాళ్లు కోకొల్లలుగా ఉండటంతో కావలిలో క్రీడలను ప్రోత్సహించడానికి అనువుగా స్టేడియం నిర్మించాలని చాలా ఏళ్లుగా ప్రతిపాదనలు ఉన్నాయి.

హామీ మరిచిన బీద మస్తాన్‌
స్టేడియం కోసం పట్టణంలోని ఉదయగిరి రోడ్డులో జనతాపేట ప్రాంతంలో అత్యంత ఖరీదైన ప్రదేశంలో ఉన్న 9 ఎకరాలను అధికారులు కేటాయించారు. ఇది 2000 సంవత్సరంలో జరిగింది. అప్పటి నుంచి ఈ స్టేడియం నిర్మించడానికి నిధులు మంజూరు కాలేదు. అయితే ప్రస్తుతం నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న బీద మస్తాన్‌రావు, 2009–2014 కాలంలో కావలిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కావలి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఈ స్టేడియం నిర్మాణం ఒకటి. ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం స్టేడియం నిర్మాణానికి పైసా నిధులు మంజూరు చేయించలేదు. కానీ 2014లో మళ్లీ ఎమ్మెల్యే ఎన్నికల సమయాన ‘ 18, ఫిబ్రవరి 2014 ’ తేదీన స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన అంటూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నిధులు లేకుండా ప్రజలను మభ్యపెట్టడానికి ఉత్తుత్తి శిలాఫలకాన్ని బీద మస్తాన్‌రావు ఆవిష్కరించారు. కాగా ఆ ఎన్నికల్లో బీద మస్తాన్‌రావు ఓడిపోయారు. అయినప్పటికీ టీడీపీ అధికారంలోకి రావడంతో కావలిలో 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అధికార పార్టీ నాయకుడుగా బీద మస్తాన్‌రావు ఈ ఐదేళ్ల కాలంలో స్టేడియం నిర్మాణానికి పైసా నిధులు మంజూరు చేయించలేదు.

డిజైన్‌ మార్చాలని హుకుం
కాంట్రాక్టర్‌ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధం కాగానే అధికార టీడీపీ నాయకుడు హోదాలో అక్కడికి వచ్చి నిర్మాణాలకు సంబంధించిన డిజైన్‌ను మార్చేయాలని అధికారులకు హుకుం జారీ చేశారు. బీద మస్తాన్‌రావు సూచించిన ప్రకారం స్టేడియం భవనం సువిశాలమైన 9 ఎకరాల స్థలంలో నడిబొడ్డుకు చేరుకుంటుందని, ఆ విధంగా నిర్మించడం వల్ల అన్ని రకాల క్రీడలకు స్థలం చాలక ఇబ్బందులు పడాల్సి వస్తోందని అధికారులు బీద మస్తాన్‌రావుకు నచ్చజెప్పారు. అయితే ఆయన అధికారుల మాటలను ఖాతరు చేయకుండా, అధికార పార్టీ నాయకుడిగా తాను చెప్పిందే కావలిలో జరగాల్సిందే అని పట్టుబట్టారు. ఈ అంశంలో బీద మస్తాన్‌రావుపై విమర్శలు వెల్లువెత్తినా ఆయన పట్టించుకోలేదు.  ఒక నిర్ణయం తీసుకున్నాక అది అమలు జరిగి తీరాల్సిందే అంటూ పట్టుదలకు పోయారు.దీంతో  రూ.2 కోట్లతో స్టేడియం నిర్మాణం పేరుతో అత్యంత ఖరీదైన 9 ఎకరాల స్థలాన్ని టీడీపీ నాయకులు నాశనం చేస్తున్నారని సర్వాత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

విస్తుపోతున్న స్థానికులు
స్టేడియం నిర్మించే ప్రాంతం పట్టణంలో నేడు ఖరీదైన ప్రాంతంగా మారింది. దానికి తోడు ఉదయగిరి రోడ్డుకు అనుకొని ఉండటంతో పాటు నివాస ప్రాంతాలకు ప్రీమియం ఏరియాగా ఉంది. అక్కడ ఎకరాలు స్థలం దొరికే పరిస్థితి లేదు. అందుకే అంకణం స్థలం కనీసం రూ.లక్ష నుంచి రూ 1.5 లక్షలు ధర పలుకుతుంది. అంటే ఎకరా రూ.7 నుంచి 8 కోట్లు ఉటుంది. సుమారు రూ.60 కోట్లు విలువ చేసే అత్యంత విలువైన స్థలాన్ని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 2 కోట్ల నిధులతో స్టేడియం భవనాన్ని నడిబొడ్డున నిర్మిస్తూ విశాలమైన స్థలాన్ని నాశనం చేస్తున్న తీరు పట్ల స్థానికులు మండిపడుతున్నారు. ప్రధానంగా ఇంజినీర్లు డిజైన్‌ చేసిన విధంగా కాకుండా, నిధులను సేట్డియం స్థలాన్ని చెడగొట్టడానికి నిర్మాణం చేయడం పట్ల స్థానికులు విస్తుపోతున్నారు.

రూ.2 కోట్ల నిధుల మంజూరు
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే విధానపరమైన నిర్ణయాలను అమలు పరిచే క్రమంలో దేశంలో పలుచోట్ల స్టేడియాలను నిర్మించడానికి నిధులు మంజూరు చేసింది. ఆ విధంగా కావలిలో కూడా స్టేడియం నిర్మించేందుకు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేసింది. స్టేడియంను ఫుట్‌బాల్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ వంటి ఆటలన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇంజినీర్లు కావలిలో స్టేడియం నిర్మాణానికి డిజైన్‌తో కూడిన ప్లానింగ్‌ తయారు చేసి, ఆ మేరకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌కు ఇచ్చారు.

మరిన్ని వార్తలు