టీడీపీ అభ్యర్థులైతే తూచ్‌

8 Apr, 2019 12:30 IST|Sakshi

యథేచ్ఛగా  కోడ్‌ ఉల్లంఘన

చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న ఎన్నికల అధికారులు

అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు 

కావలి: కావలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. నిష్పక్షపాతంగా కోడ్‌ను అమలు చేయాల్సిన ఎన్నికల అధికారులు చూసీచూడనట్లుగా వ్యహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐఏఎస్‌ అధికారే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నా కోడ్‌ ఉల్లంఘనులపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చామకూరు శ్రీధర్‌ సబ్‌కలెక్టర్‌గా  చేరిన తర్వాత మొదటి ఎన్నికలు కావడంతో కింద స్థాయి  సిబ్బందిపై ఆధారపడుతున్నారు. కింద స్థాయి సిబ్బందిలో టీడీపీకి అనుకూలంగా ఉన్న వారు మితిమీరిన జోక్యం చేసుకుంటూ ఆయన్ని తమ దారిలో తెచ్చుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

  • ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సెంటర్‌ గురించి అన్ని రాజకీయ పార్టీలకు సమాచారాన్ని అందజేయాల్సిన బాధ్యత ఎన్నికల అధికారికి ఉంది. ఈ విషయాన్ని అభ్యర్థుల ‘హ్యాండ్‌బుక్‌ ఫిబ్రవరి– 2019’ పేజీ నంబర్‌ 130లో రూల్‌ నంబర్‌ 11.3.2లో వివరింగా పొందుపరిచారు. అయితే కావలి ఎన్నికల అధికారి పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేదన్నట్లుగా వ్యహరించారు.  ఎన్నికల అధికారి కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో టీడీపీకి అనుకూలమైన వారి ద్వారానే పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ వ్యవహారంలో ఎన్నికల అధికారి  పాత్ర విమర్శలకు దారితీసింది.
  • ‘మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌’ మాన్యువల్‌లో పేజీ నంబర్‌ 29లో రూల్‌నంబర్‌ 4.4లో బీ5 ప్రకారం వ్యక్తిగత దూషణలు చేయకూడదు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర కావలిలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వైఎస్సార్‌సీపీ కావలి అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ దీనిపై నేటి వరకు ఎన్నికల అధికారి, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
  • ‘మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌’ మాన్యువల్‌లో పేజీ నంబర్‌ 144లో రూల్‌ నంబర్‌ 22.4  ప్రకారం తాత్కాలిక పార్టీ కార్యాలయంలో ఫ్లెక్సీ సైజు 4 ..8 అడుగులలో మాత్రమే ఉండాలని పొందుపరిచారు. అయితే పట్టణంలోని ఎన్నికల అధికారి  కార్యాలయానికి దగ్గరలో ఏర్పాటు చేసిన టీడీపీ తాత్కాలిక కార్యాలయం వద్ద 5..30 అడుగులతో ఉన్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి సంబంధించిన ఖర్చులు వివరాలను ఎన్నికల అధికారి పరిశీలించి అభ్యర్థి లెక్కల్లో  నిర్ధిష్టంగా కనబరచాలి. కానీ ఇవేమీ జరగలేదు.
  • ప్రయివేటు విద్యా సంస్థల్లో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని నిర్వహించకూడదు. కానీ టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి బీద మస్తాన్‌రావు, కావలి అసెంబ్లీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి కావలిలోని పమిడి స్కూల్‌ ఆవరణలో భారీ సమావేశం నిర్వహించారు. ‘అభ్యర్థుల హ్యాండ్‌ బుక్‌–ఫిబ్రవరి–2019’ పేజీ నంబర్‌ 89,265లో  ప్రయివేటు విద్యాసంస్థల్లో  రాజీకీయ పార్టీలు ఎటువంటి సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టంగా పొందుపరిచి ఉన్నా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని వార్తలు