కంపెనీలు హైదరాబాద్ వదిలేస్తున్నాయట....

26 Jun, 2014 16:23 IST|Sakshi
కంపెనీలు హైదరాబాద్ వదిలేస్తున్నాయట....
ప్రభుత్వం ఏర్పడి పక్షం రోజులు కాలేదు. ఒక్క అసెంబ్లీ సెషన్ తప్ప ఏమీ జరగలేదు. రాజధాని ఎక్కడ అన్నది ఇంకా తేలలేదు. తెలంగాణ పంచాయితీ ముగియలేదు. కేంద్రంతో లెక్కలింకా కుదరలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఫేస్ బుక్ పేజీ చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ కి రామరాజ్యం వచ్చేసింది. 
 
ఫేస్ బుక్ పేజీలో ఆ పార్టీ తెలంగాణ నుంచి పారిశ్రామిక వేత్తలందరూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూలు కడుతున్నారని, వారంతా చంద్రబాబు సామర్థ్యాన్ని చూసి వచ్చేస్తున్నారని పేర్కొన్నారు. తమాషా ఏమిటంటే ఇప్పటి వరకూ అలా వచ్చిన సంస్థల జాబితా ఇవ్వలేదు. వాటి చిరునామాలివ్వలేదు. కానీ వచ్చేస్తున్నారన్న ప్రచారం మాత్రం టీడీపీ ప్రచార తంత్రం ఉధృతంగా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు హాట్ స్పాట్ గా మారిపోయిందని కూడా పార్టీ వెబ్ సైట్ ప్రచారం చేస్తోంది. ఏకంగా 700 కంపెనీలు వచ్చేశాయని కూడా పార్టీ వెబ్ సైట్ చెబుతోంది. 
 
అయితే ప్రభుత్వం తరఫు నుంచి మాత్రం ఈ విషయంలో ఎలాంటి మాటా లేదు. అధికారికంగా ఏమీ చెప్పడం లేదు. కానీ పార్టీ ప్రచార యంత్రాంగం మాత్రం హడావిడి పడిపోతోంది. చంద్రబాబు మాత్రం ఇసుజు కంపెనీ ప్రతినిధులతో తాను సమావేశమయ్యానని, మంచి ఫలప్రదంగా సమావేశం జరిగిందని చెప్పారు. అయితే ఆ ఫలమేమిటో మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. 
మరిన్ని వార్తలు