అవనిగడ్డ టీడీపీ అభ్యర్థిగా హరిబాబు

22 Jul, 2013 13:33 IST|Sakshi

కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు శ్రీహరిప్రసాద్(హరిబాబు) పేరును టీడీపీ ఖరారు చేసింది. అంబటి బ్రాహ్మణయ్య కుటుంబ సభ్యులు ఈ ఉదయం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును కలిశారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత హరిబాబును అభ్యర్థిగా ఖరారు చేశారు. హరిబాబును ఏకగ్రీవంగా గెలిపించుకునేందుకు టీడీపీ కసరత్తు చేస్తోంది.

అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆగస్టు 21న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 27న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే నెల 3వ తేదీ చివరి గడువు. వచ్చే నెల 5న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు 7వ తేదీ తుది గడువుగా సిఇసి ప్రకటించింది.

వచ్చే నెల 21న పోలింగ్ కాగా 24న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బ్రాహ్మణయ్య మృతి చెందిన తేదీకి ఎన్నికలు సంవత్సరానికి పైగా ఉండడం వల్ల ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు