హామీలు అమల్లో టీడీపీ విఫలం

29 May, 2015 05:45 IST|Sakshi

ధర్మాన కృష్ణదాసు ధ్వజం
సమర దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

 
 నరసన్నపేట : ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ హామీలు అమలులో పూర్తిగా విఫలమ య్యారని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు అన్నారు. వచ్చే నెల 3,4 తేదీల్లో అమరావతిలో పార్టీ అధ్యక్షుడు జగన్‌మ్మోహనరెడ్డి చేపట్టే సమర దీక్షకు సంబంధించిన పోస్టర్లను ఆయన గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు పాలన తీరును దుయ్యబట్టారు.

ఏ ప్రజలకు ఇచ్చిన  హామీలతో అధికారానికి వచ్చారో వారినే మరిచి సీఎం ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటీ సవ్యంగా అమలు చేయలేదన్నారు. రుణ మాఫీ పేరిట రైతులను తీవ్రంగా మోసం చేశారని పేర్కొన్నారు. రుణ మాఫీ కాకపోగా వాడుకున్న రుణం వడ్డీతో కలపి తడిసిమొపెడు అవుతోందని అన్నారు. డ్వాక్రా రుణాల వ్యవహారంలో కూడా చంద్రబాబు మహిళలను దారుణంగా మోసం చేశారని అన్నారు. ఈవిధంగా చేయడం చంద్రబాబు నైజమన్నారు.

డ్వాక్రా రుణాలు అన్నింటినీ మాఫీ చేస్తామన్న బాబు.. సీఎం అయిన తరువాత నోటికొచ్చినట్లు మాట్లాడుతూ చివరికి అప్పులపాలు చేస్తున్నారని కృష్ణదాసు ధ్వజమెత్తారు. ప్రస్తుతం డ్వాక్రా సభ్యుల ఖాతాల్లో వేసిన మూడు వేల రూపాయలు కూడా మూలధనం అట అని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలకు ఆయన మోసం చేశారని పేర్కొన్నారు. మోసపోయిన ప్రజలకు అండగా ఉంటూ వారి తర ఫున జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు దిగుతున్నారని..ఈ దీక్షల్లో అంతా పాల్గొనాలని కోరారు. పోస్టరు ఆవిష్కరణలో నరసన్నపేట సొసైటీ అధ్యక్షుడు సురంగి నర్సింగరావు, వైఎస్సార్ సీపీ నాయకులు ఆరంగి మురళి, యాళ్ల కృష్ణంనాయుడు, పతివాడ గిరీశ్వరరావు, యాళ్ల బైరాగినాయుడు, బొబ్బాది ఈశ్వరరావు, మొజ్జాడ శ్యామ్, దండి జయప్రకాష్, యాబాజీ రమేష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు