ప్రకటనే.. చర్చ లేదు!

4 Sep, 2014 02:18 IST|Sakshi

‘రాజధాని’పై సర్కారు నిర్ణయం
 సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంపై శాసనసభలో ప్రకటనకు మాత్రమే పరిమితం కావాలని, ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నట్టు ఎలాంటి చర్చకు తావివ్వరాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టినా చర్చకు అంగీకరించరాదని, అవసరమైతే ప్రకటన అనంతరం సభను వాయిదా వేయించాలని భావిస్తోంది. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో.. మంత్రులు కేఈ కృష్ణమూర్తి, నారాయణ, కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు , చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, విప్‌లు, కొందరు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో రాజధాని ప్రాంతంపై ప్రకటన చేయాలని నిర్ణయించుకున్న సీఎం ఈ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు.
 
 రాజధాని అనేది చాలా కీలకమైన విషయమని, ఇలాంటి అంశంలో హడావుడిగా, తొందరపాటుతో కాకుండా లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిదని ప్రతిపక్షం వాదిస్తుం డడంతో.. సభలో ఎదురయ్యే అవాంతరాలపై మంతనాలు సాగించారు. ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ చర్చకు, ఓటింగ్‌కు సైతం పట్టుబడుతూ వస్తున్న నేపథ్యంలో.. అందుకు ప్రతి వ్యూహంపైనా తీవ్రంగా చర్చించారు. ప్రతిపక్షానికి ఎక్కడా, ఎలాంటి అవకాశం ఇవ్వరాదనే విధంగా వ్యవహరిస్తున్న అధికార టీడీపీ.. రాజధాని వంటి కీలక అంశంలోనూ ఇదే వైఖరి కొనసాగించాలని దృఢంగా నిశ్చరుుంచుకున్నట్టు సమాచారం. రాజధానిపై నేరుగా ప్రకటన చేయాలని నిర్ణయించారు. మూహూర్తంపై సిద్ధాంతులతో చర్చించిన చంద్రబాబు గురువారం మధ్యాహ్నం 12.17 నిమిషాలకు అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. తొలుత సభలో గందరగోళం తలెత్తితే వాయిదా వేయించాలని, తర్వాత ప్రకటన సమయానికి సభ సమావేశమయ్యేలా చూసి.. సుదీర్ఘ ప్రకటన చేయనున్నారు.
 
 భిన్నాభిప్రాయూలు మంచిది కాదు
 రాజధాని ప్రాంతంపై సీఎం ఏకపక్షంగా వెళ్తున్నట్టు కొందరు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో.. నేతలంతా ఏకతాటిపై ఉండాలని చంద్రబాబు ఈ సమావేశంలో నొక్కిచెప్పారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఇతర మంత్రులు కొందరు అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో బాబు ముందుజాగ్రత్తలు చేపట్టారు.

మరిన్ని వార్తలు