పర్యాటకంలో ‘పచ్చ’దొంగలు

15 Feb, 2020 09:11 IST|Sakshi

గత ప్రభుత్వ హయాంలో 17 వరకు పర్యాటక ఉత్సవాలు

ప్రతి ఉత్సవానికి కోట్లలో నిధుల మంజూరు

కనీసం వర్క్‌ ఆర్డర్స్‌ లేని వైనం

ఇప్పటికీ బిల్లులు పెడుతున్న వైనం

పర్యాటకుల్ని ఆకర్షించింది తక్కువే

సాక్షి,విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ టూరిజం అథారిటీ(ఏపీటీఏ) ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో నిర్వహించి అనేక ఉత్సవాల్లో కోట్లు నిధులు దుర్వినియోగమయ్యాయి. అప్పట్లో గుంటూరు జిల్లా కలెక్టర్‌ బ్లాక్‌ లిస్టులో పెట్టిన ఒక కాంట్రాక్టర్‌కు రూ.1.40 కోట్లు సొమ్ము చెల్లించిన కేసులో గుంటూరు జిల్లాలో పర్యాటక అధికారి హీరాపఠాన్‌ అరెస్టు అయిన విషయం విదితమే. వాస్తవంగా అప్పట్లో జరిగిన ఉత్సవాల వ్యయం పైనా సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

నిర్వహించిన ఉత్సవాలు ఇవే...
విభజన రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అయినా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచపటంలో పెడతానంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చలివిడిగా పర్యాటక  ఉత్సవాలు నిర్వహించారు. ఏపీటీఏను చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైంది. ఇందులో పనిచేసే అధికారులంతా టీడీపీ సానుభూతిపరులే. కాంట్రాక్టు పద్ధతిలో కీలకపదవుల్ని అదిష్టించి నిధులు పర్యాటకాభివృద్ధి పేరుతో తమ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టారు. 

గత ఐదేళ్లలో నావిషో, ఎయిర్‌షో, సంక్రాంతి సంబరాలు, ఇంటర్నేషనల్‌ మెగా ఫెస్టివల్, బుద్ద జయంతి, దీపావళి ఉత్సవాలు, నాగాయలంక బీచ్‌ ఫెస్టివల్, సోషల్‌మీడియా సమిట్, అమరావతి ధియేటర్‌ పెస్టివల్, పెలికాన్‌ బర్ట్స్, గోబెల్‌శాంతి, మసూలబీచ్‌ పెస్టివల్, ఎఫ్‌1హెచ్‌2ఓ, కొండపల్లి ఉత్సవాలు, కొటప్పకొండ ఉత్సవాలు, కొండవీడు ఉత్సవాలు, సూర్యలంక బీచ్‌ ఫెస్టివల్‌ తదితర ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలన్నీ 2017 తరువాతనే జరిగాయి. 

ఉత్సవానికి రూ.2 నుంచి రూ.3 కోట్లు ఖర్చు
ఒకొక్క ఉత్సవానికి రూ.2 నుంచి రూ.3 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఈవెంట్స్‌ నిర్వహించే సంస్థలన్నీ  అధికారుల జేబు సంస్థలే. ఏలూరులోని ఒక సంస్థ ఎక్కువ కాంట్రాక్టులు దక్కించుకున్నారు. ఈ సంస్థ ఏపీటీఏలోని ఆర్‌డీ అండ్‌ ఈడీలోని కీలక అధికారికి చెందినదిగా ఆ సంస్థలోనే సిబ్బందే చెబుతున్నారు. కనీసం వర్క్‌ ఆర్డర్‌ కూడా ఇవ్వకుండానే ఈ సంస్థలు ఉత్సవాలు నిర్వహించారు. టీడీపీకు చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, స్పీకర్‌లకు ఈ సంస్థ ప్రతినిధులకు సన్నిహిత సంబధాలు ఉండటం వల్ల వర్క్‌ ఆర్డర్‌ లేకపోయినా ఉత్సవాలు నిర్వహించారని ఏపీటీఏలో చర్చ జరుగుతోంది. 

రికవరీ చేస్తారా?
గత ప్రభుత్వ హయాంలో నిధులు లేకపోయినా ఉత్సవాలు నిర్వహించేశారు. ఇప్పుడు ఆయా బిల్లులను ఏపీటీఏ అధికారులు అప్‌లోడ్‌ చేసి సొమ్ము చెల్లిస్తున్నారు. ఇందులో భాగంగానే 2019 మార్చిలో నిర్వహించిన కొండవీటి ఉత్సవాల బిల్లులు మంజూరు చేయించారు. ఈ ఉత్సవాల్లోనూ ఏలూరుకు చెందిన సంస్థ కొంత పనిచేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడు అడ్డగోలుగా చెల్లించిన రూ.1.40 కోట్లు ఏవిధంగా కాంట్రాక్టర్‌ నుంచి రికవరీ చేస్తారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈ కాంట్రాక్టర్‌కు టీడీపీ నేతల పెద్దల ఆశీస్సులు ఉండటం గమనార్హం. 

పర్యాటకాభివృద్ధి తక్కువే...
సుమారు రూ.50 కోట్లు ఖర్చు చేసినా రాష్ట్రానికి వచ్చిన పర్యాటకుల సంఖ్య తక్కువే. ఉత్సవాల్లో ఎక్కువగా అధికారులు, ఈ జిల్లా ప్రాంత వారే కనపడేవారు. వాస్తవంగా అప్పట్లో జరిగిన పర్యాటక ఉత్సవాలను ప్రజలు కూడా మరిచిపోయారు. ఇదే సొమ్ముతో భవానీద్వీపం లేదా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధిచేసి ఉంటే స్థానిక ప్రజలకు ఉపయుక్తంగా వుండేది.

మరిన్ని వార్తలు