అట్రాసిటీ కేసు నమోదుతో టీడీపీ నేత హైడ్రామా

25 Feb, 2016 04:34 IST|Sakshi

కుటుంబంతో సహా ఆత్మహత్యా   
యత్నానికి పాల్పడ్డ వైనం
అడ్డుకున్న పోలీసులు

  
సంగం (ఆత్మకూరురూరల్)
: గ్రామంలో తనపై కక్ష కట్టి అట్రాసిటీ కేసు నమోదు చేశారని  కుటుం బసమేతంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని జన్మభూమి కమిటీ మెంబరు నానా యాగీ చేసిన సంఘటన సంగం మండలం పడమటిపాళెంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. పడమటిపాళెం గ్రామానికి చెందిన షేక్ రసూల్, అతని సోదరులపై మంగళవారం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు కులం పేరుతో దూషించారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. సంగం ఎస్సై వేణు కేసు నమోదు చేసుకున్నారు. దీంతో రసూల్, తనపై కక్ష కట్టి ఎలాంటి నేరం చేయకున్నా అట్రాసిటీ కేసు నమోదు చేయడం దారుణమని, తనకు అవమానం జరిగిందని ఇంటి చుట్టుప్రక్కల వారికి చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో బుధవారం తనకు న్యాయం జరగదని భావించి కుటుంబ సమేతంగా భార్య, ఇద్దరు పిల్లలతో గృహ నిర్భందం చేసుకున్నాడు. ఇంటి లోపల తలుపులు బిగించుకొని ఆత్మహత్యకు పాల్పడుతున్నామని అందరికీ చెప్పడంతో సమీపంలోని వారు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఎస్సై, బుచ్చిరెడ్డిపాళెం సీఐ గంగా వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అవకాశం లేకపోవడంతో కిటికీ వద్ద నుంచి రసూల్‌తో మాటలు కలిపా రు. తాను న్యాయం చేస్తానని, ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని ఎస్సై హామీ ఇవ్వడంతో కిటికీ తలుపులు తెరిచి పోలీసు సిబ్బందితో రసూల్ మాట్లాడాడు. ఈ తరుణంలో వెనుకవైపు నుంచి పోలీసు సిబ్బంది లోపలికి ప్రవేశించి ఒంటిపై కిరోసిన్ పోసుకోబోతున్న కుటుంబ సభ్యులను తప్పించారు. అందర్నీ వెలుపలికి తీసుకువచ్చి ఎలాంటి కేసులు నమోదుచేయబోమని, అట్రాసిటీ కేసుపై పూర్తిస్థాయిలో విచారిస్తామని హామీ ఇవ్వడంతో కథ సుఖాంతమైంది.

>
మరిన్ని వార్తలు