మరోసారి టీడీపీ నేత ‘కూన’ రౌడీయిజం

28 Jun, 2020 04:55 IST|Sakshi

అద్దె భవనం ఖాళీ చేయాలన్నందుకు యజమానికి బెదిరింపు

భవనం దగ్గరకు వస్తే చంపేస్తానంటూ హెచ్చరికలు

గతంలో ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి మూడుసార్లు అరెస్టు

పొందూరు: ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి గతంలో మూడుసార్లు అరెస్టయి బెయిల్‌పై ఉన్నా టీడీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ తీరు మారలేదు. ఈసారి పొందూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత గుడ్ల మోహన్‌ను బెదిరించాడు.  మోహన్‌కు చెందిన భవనంలో గత పదేళ్లుగా టీడీపీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన ఆయన తన భవనాన్ని ఖాళీ చేయాలని కూన రవికుమార్‌ను కోరారు. అయితే.. కూన  మాత్రం ఖాళీ చేయడానికి ససేమిరా అంటున్నారు. ఖాళీ చేయాలని మోహన్‌ ఫోన్‌ చేయగా రవికుమార్‌ తన బెదిరింపు స్వభావాన్ని మరోసారి బయటపెట్టారు. ‘నేను ఖాళీ చేయను.

నువ్వు ఎక్కువ చేస్తే మాత్రం చాలా సీరియస్‌గా ఉంటుంది’ అని బెదిరించారు. తన ఇబ్బందుల గురించి ఆలోచించాలని మోహన్‌ అడిగితే ‘నీ ఇబ్బందులు నాకనవసరం.. నీ గురించి నేను ఆలోచించేదేంటి?’ అంటూ రెచ్చిపోయారు. ‘సరే మీ ఇష్టం సార్‌’ అని అనగా ‘నువ్వు మర్యాద తప్పి ప్రవర్తిస్తే నేనూ మర్యాద తప్పుతా’ అని బెదిరింపులకు దిగారు ‘మీరు ఏది చేస్తే అది చేసేయండి సార్‌.. చంపేస్తే చంపేయండి సార్‌’ అని మోహన్‌ అనడంతో ‘అంతే చేస్తాను. నువ్వు బిల్డింగ్‌ దగ్గరకు వస్తే అంతే చేస్తా’ అని ఫోన్‌ కాల్‌ ముగించారు.

పార్టీ మారినందుకే కక్ష సాధింపు
1983 నుంచి ఆర్నెల్ల క్రితం వరకు టీడీపీలో ఉన్నాను. టీడీపీ కార్యకలాపాలకు నా భవనాన్ని ఉచితంగానే ఇచ్చాను. కరెంటు బిల్లు నేనే కట్టుకుంటున్నాను. ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నాను. నెల రోజుల నుంచి ఖాళీ చేయాలని అడుగుతుంటే నా బిల్డింగ్‌ అప్పగించడం లేదు. పార్టీ మారినందుకే కూన రవికుమార్‌ కక్ష సాధిస్తున్నారు. చంపేస్తానని బెదిరించారు.  
    –గుడ్ల మోహన్, వైఎస్సార్‌సీపీ నేత, పొందూరు

మరిన్ని వార్తలు