సక్రమమైతే రూ.64 లక్షలు ఎందుకు చెల్లించినట్టు..?

25 Aug, 2019 11:24 IST|Sakshi

ఏప్రిల్‌ 10న సిమెంట్‌ లోడు లారీలో పట్టుబడ్డ రూ.1.92 కోట్లు 

ఆ సొమ్ము ఇప్పించాలని నగర సీపీకి మాజీ ఎంపీ మాగంటి బాబు విజ్ఞప్తి 

సాక్షి, అమరావతి బ్యూరో: సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసులకు పట్టుబడిన రూ.1.92 కోట్లు తనదేనని మాజీ ఎంపీ మాగంటి బాబు క్లెయిమ్‌ చేసుకున్నారు. అది చేపలు అమ్మగా వచ్చిన ఆదాయమని.. ఆ మొత్తాన్ని రిలీజ్‌ చేసి తనకు ఇప్పించాలని కోరుతూ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌కు మాగంటి విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా.. ఏప్రిల్‌ 10వ తేదీన సిమెంట్‌ లోడు లారీలో తరలిస్తున్న రూ.1,92,90,500 నగదును విజయవాడ పటమట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగ్గయ్యపేట నుంచి ఏలూరు వెళ్తున్న లారీని కామినేని ఆస్పత్రి సమీపంలో చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేశారు.

అందులో సిమెంట్‌ బస్తాల మధ్య రెండు బాక్స్‌లు ఉండటాన్ని గమనించి వాటిని తెరిచి చూడగా.. భారీ నగదు కనిపించింది. ఈ సమయంలో అదే లారీలో ప్రయాణిస్తున్న మాగంటి అనుచరుడు పరారయ్యాడు. డ్రైవర్‌ కోగంటి సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తనకేమీ తెలియదని.. ఆ డబ్బును ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి కోసం తీసుకెళ్తున్నట్టు తనతోపాటు లారీలో వచి్చన యువకుడు చెప్పాడని డ్రైవర్‌ వాంగ్మూలం ఇచ్చాడు. ఎలాంటి ఆధారాలు, పత్రాలు లేకుండా తరలిస్తున్న ఆ మొత్తాన్ని అప్పట్లో విజయవాడ నగర పోలీసులు సీజ్‌ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

రెండు రోజుల క్రితం నగర పోలీస్‌ కమిషనర్‌ను కలిసిన మాగంటి బాబు ఆ సొమ్ము మొత్తం తనదేనని, చేపల్ని విక్రయించగా సమకూరిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన లావాదేవీ పత్రాలను ఆదాయ పన్ను శాఖ అధికారులకు చూపగా రూ.64 లక్షల పన్ను విధించారని వివరించారు. పన్ను చెల్లించిన దృష్ట్యా సీజ్‌ చేసిన డబ్బును తనకు ఇప్పించాలని కోరారు. మాగంటి బాబు చెబుతున్నట్టుగా ఆ డబ్బు సక్రమంగా సంపాదించిందే అయితే రూ.64 లక్షలను ఆదాయ పన్ను, అపరాధ రుసుంగా ఎందుకు చెల్లించాల్సి వచి్చందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేపల విక్రయం ద్వారానే అంత ఆదాయం వచి్చనా.. పన్నులేవీ చెల్లించకుండా రహస్యంగా ఎందుకు తరలించాల్సి వచి్చందనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. పోలీసులు కనబడగానే మాగంటి అనుచరుడు పరారవటం కూడా అనుమానాలకు తావిస్తోంది.

మరిన్ని వార్తలు