రేషన్‌ కార్డులపై టీడీపీ దుష్ప్రచారం 

10 Dec, 2019 05:14 IST|Sakshi
రేషన్‌ కార్డులపై క్రీస్తు ఫొటో ముద్రించిన చిత్రం

ఉద్దేశపూర్వకంగా క్రీస్తు బొమ్మ ముద్రించిన వైనం

తూర్పుగోదావరి జిల్లాలో ఓ టీడీపీ నాయకుడి నిర్వాకం  

సాక్షి, అమరావతి: రేషన్‌ కార్డులపై ఉద్దేశపూర్వకంగా క్రీస్తు బొమ్మను ముద్రించి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకుడి వ్యవహారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం వడ్లమూరులో వెలుగులోకొచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన పౌర సరఫరాల శాఖాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వడ్లమూరుకు చెందిన మంగాదేవి రేషన్‌డీలర్‌ కాగా, ఆమె భర్త టీడీపీ నాయకుడు. రేషన్‌ కార్డులపై ఆయన కావాలనే క్రీస్తు బొమ్మను ముద్రించి వాటిని వినియోగదారులకిచ్చి.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ఇలా చేయిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నాడని అధికారులు గుర్తించారు.

2016లో ఇతనే రేషన్‌ కార్డులపై సాయిబాబా బొమ్మను, 2017లో వేంకటేశ్వరస్వామి బొమ్మను ముద్రించాడు. వైఎస్సార్‌సీపీపై బురద జల్లేందుకే పార్టీ పెద్దల సూచనల మేరకు తాజాగా క్రీస్తు ఫొటోను ముద్రించినట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. అన్యమత ప్రచారం పేరుతో టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా కొద్దిరోజులుగా వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గ్రామస్థాయిలో తమకు కుదిరిన ప్రాంతాల్లో ఇలాంటి చర్యలకు టీడీపీ శ్రేణులు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు