అప్పు కట్టకపోతే కోరిక తీర్చు

10 Jun, 2018 14:02 IST|Sakshi

టీడీపీ నాయకుడి లైంగిక వేధింపులు 

పోలీసుస్టేషన్‌లో బాధితురాలి ఆత్మహత్యాయత్నం 

నంద్యాల: వరుసకు మేనకోడలయ్యే మహిళకు అప్పు ఇచ్చి, దాన్ని తీర్చకపోతే తన కోరిక ఎప్పుడు తీరుస్తావంటూ మెసేజ్‌లు పెడుతూ టీడీపీ నాయకుడు వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన  బాధితురాలు శుక్రవారం రాత్రి పోలీసుస్టేషన్‌లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. నంద్యాల వన్‌టౌన్‌ సీఐ అస్లాంబాష  తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని వెంకటాచలం కాలనీకి చెందిన శివుడి భార్య నాగమణికి వరుసకు మామ అయ్యే టీడీపీ నాయకుడు వెంకటేశ్వర్లు రూ.లక్ష అప్పు ఇచ్చాడు.

 ఆమె అప్పు చెల్లించకపోవడంతో వేధించసాగాడు. ‘నా కోరిక తీర్చు..  అప్పు వదిలేస్తా’ అంటూ సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు కూడా పెట్టాడు. దీంతో బాధితురాలు ఎస్పీని కలిసి సమస్య వివరించింది. ఎస్పీ సూచన మేరకు వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటేశ్వర్లును శుక్రవారం రాత్రి పిలిచి విచారిస్తున్న సమయంలోనే...అతడి తీరుతో విసిగిన బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమెను శనివారం వైఎస్సార్‌సీపీ నంద్యాల నియోజకవర్గ నేత శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి పరామర్శించారు. న్యాయం జరిగే దాకా అండగా పోరాడతామని భరోసా ఇచ్చారు.  

మరిన్ని వార్తలు