దళితులపై టీడీపీ నాయకుల దాడి

19 Jan, 2019 11:49 IST|Sakshi
దాడిలో గాయపడిన బాధితులు

అనంతపురం, కణేకల్లు: కణేకల్లు మండలం గరుడచేడులో దళితులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. మహిళలనే కనికరం లేకుండా వారిని పరుష పదజాలంతో దుర్భాషలాడారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ఎస్సీ కాలనీలో లక్ష్మీ అనే మహిళ తన ఇంటి ముందు దుస్తులను ఉతుకుతుండగా విద్యుత్‌శాఖ లైన్‌మన్, టీడీపీ మద్దదారుడైన నామల పరుశరాం ‘నీళ్లన్నీ రోడ్డుపై వస్తున్నాయ్‌... ఈ ..లకు ఎక్కడ బట్టలు ఉతకాలో తెలియదం’టూ దుర్భాషలాడాడు.

ఇంతలో ఇంట్లో ఉన్న లక్ష్మీ తోడికోడళ్లు జంబక్క, వండ్రమ్మలు బయటికొచ్చి మర్యాదగా మాట్లాడండని చెబితే ఆవేశంతో అతడు అందరినీ దూషించాడు. అంతటితో ఆగకుండా అతని తమ్ముడు కుమార్, మరో ఇద్దరిని పిలిపించుకొని మహిళలపై దాడి చేశాడు.  వండ్రమ్మ భర్త దర్గయ్య, అతని కుమారుడు రాజు అడ్డుకోగా వారిని కులం పేరుతో తిట్టి దాడులు చేశారు. కాళ్లు, చేతులతో ఇష్టమొచ్చినట్లు చావబాదారు. తాము ఇటీవలే బటన్‌హోల్‌ ఆపరేషన్‌ చేయించుకున్నామని, ఇష్టానుసారంగా కొట్టడంతో తీవ్రమైన కొడుపు నొప్పి వచ్చిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కణేకల్లు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.    

మరిన్ని వార్తలు