టీడీపీ వర్గీయుల దాష్టీకం

17 Jan, 2019 12:39 IST|Sakshi
సీఐతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి. చిత్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు

వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటిపై దౌర్జన్యం

టీవీ, ఫ్యాన్‌ ఇతర వస్తువుల ధ్వంసం

కార్యకర్త తల్లికి బెదిరింపు

నీ కొడుకు కనిపిస్తే చంపుతామని హెచ్చరిక

అనంతపురం, తాడిపత్రి అర్బన్‌: తాడిపత్రిలో టీడీపీ వర్గీయులు రెచ్చిపోతున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీలో చురుగ్గా పనిచేసే వారిని ఇబ్బందులు పెడుతున్నారు. దాడులకు తెగబడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గన్నెవారిపల్లి కాలనీలో నివాసముంటున్న ఉప్పర రవికుమార్‌ వైఎస్సార్‌సీపీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం టీడీపీ వర్గీయులైన జనార్దన్, హరితో పాటు మరికొందరు యువకులు ఉప్పర రవికుమార్‌ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో రవికుమార్‌ లేడు. అతడి తల్లి మాధవి మాత్రమే ఉంది. ‘ఏయ్‌ నీ కొడుకు ఎక్కడ? వానికి కాళ్లు, చేతులు విరిచేస్తాం..  వాణ్ణి చంపుతాం’ అంటూ టీడీపీ వర్గీయులు బెదిరించారు. అంతటితో ఆగక టీవీ, టేబుల్‌ ఫ్యాన్‌ తదితర సామగ్రిని ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. నీ కొడుకు వైఎస్సార్‌సీపీలో తిరిగితే చంపుతామంటూ మాధవిని దూషించారు. చుట్టుపక్కల వారు వచ్చే లేపు టీడీపీ వర్గీయులు అక్కడి నుంచి పరారయ్యారు.

కేసు నమోదులో తాత్సారం
కార్యకర్త ఇంటిపై దాడి గురించి సమాచారం తెలియగానే వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి తన అనుచరులతో కలిసి ఉప్పర రవికుమార్‌ ఇంటికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితుడు రవికుమార్‌ తల్లి ఉప్పర మాధవిని వెంట పెట్టుకుని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. నాయకులు పైలా నరసింహయ్య, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి పేరం స్వర్ణలత, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు గయాజ్‌బాషాలు కూడా పోలీస్‌స్టేషన్‌ వద్దకు  చేరుకున్నారు. బాధితురాలు మాధవి నుంచి కేసును స్వీకరించేందుకు సీఐ నారాయణరెడ్డి మీనమేషాలు లెక్కించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి జోక్యం చేసుకుని దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే సీఐ నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా రమేష్‌రెడ్డి ససేమిరా అన్నారు. చేసేదిలేక ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు