సాక్షి, పశ్చిమగోదావరి: అధికారం అడ్డు పెట్టుకోని రాష్ట్రంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వైఎస్సార్సీపీ నాయకుడు, వడ్లపట్ల ప్రెసిడెంట్ రామిశెట్టి శ్రీనుబాబుపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు పెంట్రోల్ బంక్ వద్ద చోటుచేసుకుంది. దీంతో భీమడోలు పీఎస్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకుంది. రామిశెట్టి టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాల్లో పోస్టులు పెడుతున్నాడనే నేపంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. టీడీపీ నేత గంజి మాహేష్, అతని అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది.
ఈ ఘటనలో రామిశెట్టి శ్రీనుబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతని ఏలూరు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదుపులోకి తీసుకున్న అరగంటలోపే .. వారిని విడిపించేందుకు టీడీపీ నేతలు యత్నించారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు భీమడోలు పీఎస్ ముందు బైఠాయించారు. దీనిపై పూర్తి విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన విరమించారు.