వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి

1 Aug, 2013 06:01 IST|Sakshi

 మార్కాపురం టౌన్, న్యూస్‌లైన్ : మండలంలోని నాయుడుపల్లెలో జరిగిన తుది విడత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ మద్దతుతో పోటీ చేసిన స్నేహలత గెలవటంతో తట్టుకోలేని టీడీపీ వర్గీయులు బుధవారం రాత్రి ఆ పార్టీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అనంతరం జరిగిన పరస్పర దాడుల్లో ఇరువర్గాలకు చెందిన పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ప్రైవేటు వాహనంలో మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ కూడా పరస్పర దాడులకు ప్రయత్నించటంతో సింగరాయకొండ సీఐ అశోక్‌వర్ధన్ స్పల్ప లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
 
 వివరాలు.. నాయుడుపల్లె గ్రామానికి చెందిన పొందుగుల నారాయణరెడ్డి, లక్ష్మీదేవిలు గతంలో టీడీపీ వర్గంలో ఉండగా ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీకి అండగా ఉన్నారు. ఆగ్రహించిన టీడీపీ వర్గీయులు వారిపై దాడికి పూనుకున్నారు. దీంతో ఇరువర్గాలూ పరస్పరం దాడులు చేసుకున్నాయి. గాయపడిన వారిలో వైఎస్‌ఆర్ సీపీకి చెందిన టి.వెంకటేశ్వరరెడ్డితో పాటు మరికొందరు, టీడీపీకి చెందిన తిరుమలరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరికొందరు ఉన్నారు. దీంతో గ్రామంతో పాటు ఏరియా వైద్యశాలలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. క్షతగాత్రులను వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి, ఉడుముల కోటిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణమోహనరెడ్డి, షేక్ ఇస్మాయిల్, గుంటక వెలుగొండారెడ్డి, కానాల శ్రీనివాసరెడ్డి పరామర్శించారు.  
 

మరిన్ని వార్తలు